నెల వ్యవధిలో మోదీ ఇద్దరు సలహాదారుల రాజీనామా..!

దేశ పరిపాలనను ప్రధాని కనుసన్నల్లోనే జరుగుతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. ప్రధానికి సంబంధించిన ఈ విషయాలన్నింటినీ పీఎంవో చూసుకుంటూ ఉంటుంది. అత్యంత కీలకంగా వ్యవహరించే ఈ పీఎంవో(ప్రధాన మంత్రి కార్యాలయం) లో ముసలం మొదలైందంటూ గుసగుసలు వినపడుతున్నాయి. అందుకు.. సాక్ష్యం ఒకే నెలలో ఇద్దరు కీలక వ్యక్తులు రాజీనామా చేయడమే. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)లో సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్‌ అధికారి అమర్జీత్ సింగ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహరాలను అమర్జీత్‌ సిన్హా చూస్తున్నారు. 1983 బిహార్‌ క్యాడర్‌ ఐఏఎస్ అధికారి అయిన అమర్జీత్‌ సిన్హా … 2019లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేళ్లపాటు పీఎంవో సలహాదారుగా నియమితులయ్యారు.

అయితే, ఆయన పదవీ కాలం ఇంకా ఏడు నెలలు మిగిలి ఉండగానే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గతంలో పీఎంవోలో ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా పనిచేసిన మాజీ కేబినెట్‌ కార్యదర్శి పీకే సిన్హా రాజీనామా చేసిన కొన్ని నెలల్లోనే అమర్జీత్‌ కూడా అదే బాటపట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే అమర్జీత్‌ తన రాజీనామాకు కారణాలను మాత్రం పేర్కొనలేదని సమాచారం.