వరంగల్ కేసు మిస్టరీ వీడింది

వరంగల్‌ నగర శివార్లలోని గొర్రెకుంటలో తొమ్మిది మంది ఒకేసారి పాడుబడ్డ బావిలో శవాలుగా తేలిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ముందు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు వార్తలొచ్చాయి. కానీ విచారణలో ఇవన్నీ హత్యలని తేలింది.

ఈ హత్యలకు సూత్రధారి ఎవరో.. వాళ్లందరూ ఎలా చంపబడ్డారో పోలీసులు కనిపెట్టారు. మూడు రోజుల పాటు పది పోలీసు బృందాలు నిర్విరామంగా పని చేసి హత్యల వెనుక మిస్టరీని ఛేదించారు. బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కనిపెట్టారు. అతను నేరాన్ని పోలీసుల వద్ద అంగీకరించాడు కూడా.

బాధితులకు నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి.. వాళ్లంతా స్పృహ కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరిని బావిలో వేసి వారి ప్రాణాలు తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధిత కుటుంబ పెద్ద అయిన మక్సూద్ కూతురు బుస్రాతో ఉన్న వివాహేతర సంబంధమే సంజయ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణమని వెల్లడైంది.

స్రాకు ఇప్పటికే పెళ్లవగా.. భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరి కుటుంబమంతా గొర్రెకుంటలోని ఓ గోనె సంచుల గోదాంలో పని చేస్తున్నారు. మక్సూద్ కుటుంబం 20 ఏళ్ల కిందటే బీహార్ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడింది. సంజయ్‌తో వివాహేతర సంబంధం విషయంలో బుస్రాకు.. ఆమె తల్లికి మధ్య గొడవ నడిచింది. ఇటీవల వీరి ఇంటి పైన ఉండే శ్యాం, శ్రీరాం అనే ఇద్దరు కుర్రాళ్లు వీరి కుటుంబ గొడవల్లో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ అందరి మీదా పగ పెంచుకున్నాడు.

బుధవారం రాత్రి మక్సూద్ ఇంట్లో చిన్న పార్టీ లాంటిది జరిగింది. అందరూ బిరియానీలు తిన్నారు. కూల్ డ్రింక్స్ తాగారు. సంజయ్ కుమార్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా అతను కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపాడు. అవి తాగి అందరూ స్పృహ తప్పిపోగా.. కాళ్లు చేతులు కట్టేసి.. ఒక్కక్కరినీ తీసుకెళ్లి పాడుబడ్డ బావిలో పడేశాడు. వాళ్లంతా నీళ్లు తాగి ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ కుమార్‌కు మరో వ్యక్తి సాయపడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.