బ‌ద్వేల్‌ను టీడీపీ ఏం చేస్తుంది…?

Badvel

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి.. అదిగో ఉప ఎన్నిక అన‌గానే.. ఇదిగో అభ్య‌ర్థి.. అంటూ.. నానా హ‌డావుడి చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. కీల‌క‌మైన స్థానంపై మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా ఇది పార్టీకి.. వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు కూడా ప్ర‌తిష్టాత్మ‌కమే అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న పెద్ద‌గా రియాక్ట్ కావ‌డం లేదు.

అదే.. క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ నాయ‌కుడు వెంక‌ట సుబ్బ‌య్య‌.. హ‌ఠాన్మ‌రణం చెందారు. దీంతో మ‌రో నెలలో దీనికి సంబందించి నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే..తిరుప‌తి పార్ల‌మెంటు స్థానంపై ఉన్న చాక‌చ‌క్యం, వ్యూహం ఇక్క‌డబాబుకు కొర‌వ‌డ్డాయ‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి తిరుప‌తి క‌న్నా కూడా బ‌ద్వేల్‌.. టీడీపీకి ఇప్పుడున్న ప‌రిస్థితిలో చాలా ప్ర‌తిష్టాత్మకం. జ‌గ‌న్‌పై పైచేయి సాధించాల‌న్నా.. ఆయ‌న సొంత జిల్లాలోనూ టీడీపీకి తిరుగులేద‌ని.. ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నా.. లేదా.. జ‌గ‌న్ విధానాల‌తో ఆయ‌న సొంత జిల్లా ప్ర‌జ‌లు కూడా వైసీపీకి దూర‌మ‌య్యార‌నే వాద‌న‌ను ప్ర‌జ‌ల‌కు వినిపించాల‌న్నా.. కూడా బ‌ద్వేల్ ఉప ఎన్నిక టీడీపీకి అత్యంత కీల‌క‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోనీ.. ఇక్క‌డ టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కసారి కూడా విజ‌యం ద‌క్కించుకోలేదా? అంటే.. అలాఏమీ లేదు. గ‌తంలో 1985, 1994, 1999 వ‌రుస‌ ఎన్నిక‌ల్లో బిజివేముల వీరారెడ్డి టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకుని పార్టీని అభివృద్ధి చేశారు.

అంటే.. రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఇప‌ప్ప‌టికీ ఒక్క‌సారి కూడా బోణీ కొట్ట‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోల్చుకుంటే.. ఇది బెట‌రే క‌దా! పైగా.. ఇక్క‌డ పార్టీకి కార్య‌క‌ర్త‌లు నేత‌లు కూడా ఉన్నారు. అయితే.. లేనిద‌ల్లా.. చిత్త‌శుద్ధి, స్థిర‌మైన నాయ‌క‌త్వం. గ‌డిచిన కొన్నాళ్లుగా చంద్ర‌బాబు ఇక్క‌డ నాయ‌కుల‌ను మారుస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇది వాద‌నే కాదు.. వాస్త‌వం కూడా. 2004లో కోనిరెడ్డి విజ‌య‌మ్మ‌, 2009లో ల‌క్కినేని చిన్న‌య్య‌, 2014లో ఎన్ డీ విజ‌య‌జ్యోతి, 2019లో ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌ల‌కు చంద్ర‌బాబు టికెట్లు కేటాయించారు. అంటే.. నాలుగు ఎన్నిక‌ల్లోనూ అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం పార్టీకి ఇబ్బందిగా మారింది.

ఇక‌, ఆయా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన త‌మ్ముళ్ల‌కు వ‌చ్చిన ఓట్లు చూస్తే.. 2004లో విజ‌య‌మ్మ‌.. 51 వేల పైచిలుకు ఓట్లు సంపాయించుకున్నారు. కేవ‌లం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లో ల‌క్కినేని చిన్న‌య్య త్రిముఖ పోటీలో కూడా 41 వేల ఓట్లు సంపాయించుకున్నారు. 2014లో విజ‌య‌జ్యోతి.. ఏకంగా 68 వేల పైచిలుకు ఓట్లు సంపాయించుకుని సెకండ్ ప్లేస్‌కు వెళ్లారు.

2019లో రాజ‌శేఖ‌ర్‌.. 50 వేల పైచిలుకు ఓట్లు సంపాయించుకున్నారు. దీనిని గ‌మ‌నిస్తే.. టీడీపీకి ఓటుబ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ..నిల‌క‌డైన నేత‌ను నిల‌బెట్ట‌ని ఫ‌లితం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ను క‌నుక‌.. తిరుప‌తి మాదిరిగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ముందుకు సాగితే.. జ‌గ‌న్ కోట‌లో జెండా పాత‌డం.. చంద్ర‌బాబుకు తేలిక అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.