నిమ్మగడ్డ పై ప్రివిలేజ్ కత్తి

స్టేట్ ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రివిలేజ్ కమిటి కత్తి వేలాడుతోంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ హక్కులకు భంగం కలిగించారని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ చాలా కాలం క్రితం నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రులు, ఎంఎల్ఏల నుండి వచ్చిన ఇలాంటి ఫిర్యాదులపై కమిటి ఇప్పటికే మూడుసార్లు సమావేశమై చర్చించింది.

అన్నీ ఫిర్యాదుల్లోకి నిమ్మగడ్డపై వచ్చిన ఫిర్యాదే కీలకమైనది. దీనిపై వివరంగా చర్చించిన కమిటి గతంలోనే వివరణ కోరుతు నిమ్మగడ్డకు నోటీసిచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని సమాధానమిచ్చారు. ఇదే సమయంలో ఆయన ఇచ్చిన వివరణపైన కమిటి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇదే విషయాన్ని తాజాగా మరోసారి చర్చిందింది. కమిటి మళ్ళీ ఆగష్టు 10వ చర్చించాలని డిసైడ్ చేసింది.

వచ్చే నెలలో జరిగే సమావేశంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చుకోవాలని ఆదేశాలు ఇవ్వటమా ? లేకపోతే డైరెక్టుగానే యాక్షన్ తీసుకోవటమా ? అనే విషయం తేల్చేయాలని కమిటి సభ్యులు నిర్ణయించారు. డైరెక్టుగా యాక్షన్ తీసుకోవటమంటే బహుశా నిమ్మగడ్డ అరెస్టు చేయాలని కమిటి డిసైడ్ చేసినట్లు స్పీకర్ కు నివేదిక ఇవ్వచ్చు. కమిటి తాను తీసుకున్న నిర్ణయాలను స్సీకర్ కు నివేదికరూపంలో అందిస్తుంది. దానిపై స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. మామూలుగా కమిటి సిఫారసులను స్పీకర్ కాదనే అవకాశం లేదు.

కాబట్టి నిమ్మగడ్డ అరెస్టు తప్పదనే సంకేతాలను గతంలోనే కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఒకవేళ అదేగనుక జరిగితే రాజకీయంగా రాష్ట్రంలో రచ్చ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఏ చిన్న విషయమైనా రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద వివాదమైపోతున్న విషయం అందరు చూస్తున్నదే. తాజా పరిణామాలను చూస్తుంటే ఆగష్టు 10వ తేదీ సమావేశంలో నిమ్మగడ్డ వ్యవహరం ఫైనల్ అయిపోయేట్లుంది.