తెలంగాణాకు జగన్ ఫిట్టింగ్

జల జగడాల పరిష్కారం విషయలో తెలంగాణా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కరెక్టు ఫిట్టింగ్ పెట్టారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలపై ఏపి ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలను వ్యక్తంచేసినా ఉపయోగం కనబడలేదు. పైగా శ్రీశైలం డ్యాం, పులిచింతల ప్రాజెక్టుల్లో నుండి నీటి నిల్వ సామర్ధ్యంతో సంబంధంలేకుండానే విద్యుత్ ఉత్పత్తి చేసేసింది. ఈ విషయమై జగన్ ఎంత చెప్పినా కేసీయార్ ఏమాత్రం లెక్కచేయలేదు.

దాంతో తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి ఉపయోగం లేదని గ్రహించిన జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖలు రాశారు. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం నుండి కూడా పెద్దగా స్పందన కనబడలేదు. ఇదే సమయంలో నీటికేటాయింపుల్లో బచావత్ ట్రైబ్యునల్ చెప్పిన 299 టీఎంసీలు కాకుండా తమకు 400 టీఎంసీలు కావాలంటు కేసీయార్ పేచీకి దిగారు. దాంతో ఇక లాభం లేదనుకుని జల జగడాలపై ఏపి ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసింది.

జగన్ అభ్యంతరాలను తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోకపోయినా, జగన్ లేఖలకు కేంద్రం స్పందించకపోయినా పర్వాలేదు. కానీ సుప్రింకోర్టు ఇచ్చే నోటీసులకు ఇటు తెలంగాణా ప్రభుత్వం అటు కేంద్రం రెస్పాండై తీరాలి. సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే జరగబోయేదేంటో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే కేసు విషయాన్ని జగన్ ప్రకటించగానే వెంటనే జల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణా ప్రభుత్వం నిలిపేసింది.

కోర్టుల్లో వ్యవహారమంటే తొందరగా తేలేది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా ప్రాజెక్టుల నిర్వహణను రాష్ట్రాల పరిధిలోనుండి తప్పించి కేంద్రం పరిధిలోకి చేర్చమని ఏపి ప్రభుత్వం తన పిటీషన్లో కోరింది. ఏపికి ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా ప్రభుత్వం చేసిన నష్టాన్ని ఆధారాలతో సహా వివరించింది. ప్రాజెక్టుల నిర్వహణ తెలంగాణా చేతిలో ఉన్నంతవరకు ఏపికి అన్యాయం జరుగుతునే ఉంటుందని స్పష్టంగా చెప్పింది.

తెలంగాణా వల్ల ఏపికి జరుగుతున్న నష్టాన్ని కేంద్రానికి చెప్పినా పట్టించుకోలేదన్న విషయాన్ని ఏపి సర్కార్ తన పిటీషన్లో స్పష్టంగా చెప్పింది. కేంద్రానికి రాసిన లేఖలను కూడా జతచేసింది. నీటి కేటాయింపుల్లో బ్రజేష్ ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా కేసీయార్ మాట్లాడిన మీడియా క్లిప్పుంగులను కూడా జతచేసింది. ఏపి పిటీషన్ నేపధ్యంలో తెలంగాణా, కేంద్రప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే.