రోజాకు వైసీపీలో సెగ మామూలుగా లేదే ?

చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే, జ‌బ‌ర్దస్త్ రోజాకు బాగానే సెగ త‌గులుతోంది. పైకి బాగానే యాక్టివ్‌గా ఉన్న‌ట్టు క‌నిపించినా.. ఆమె దూకుడు కార‌ణంగా.. పార్టీలో కీల‌క నేత‌ల నుంచి మంత్రుల వ‌ర‌కు.. క్షేత్ర‌స్థాయిలో రోజాపై సెగ‌లు క‌క్కుతున్నారు. “ఆమె ఎవ‌రినీ లెక్క‌చేయ‌దు. నియోజ‌క‌వ‌ర్గం అంటే.. జ‌బ‌ర్ద‌స్త్ కాంపౌండ్ లా ఫీల‌వుతోంది!” అని నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీనేత‌లే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న రోజాకు.. వాస్త‌వానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే.. ఈ పార్టీ నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చే విష‌యం ప‌క్క‌న పెడితే.. సొంత పార్టీలోనే రోజాకు పొగ‌పెడుతున్న వారు పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కేజే కుమార్‌, శాంతి దంప‌తులు .. వాస్త‌వానికి రోజా వ‌ర్గంగానే కొన్నాళ్ల వ‌ర‌కు కొన‌సాగారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లోనూ రోజా విజ‌యానికి వారు కృషి చేశారు. అయితే.. రోజా వీరిని ప‌క్క‌న పెట్టి.. (ఎందుకంటే.. వీరు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి వ‌ర్గంగా ఉండ‌డం) మ‌రో వ‌ర్గాన్ని చేర‌దీసింది. దీంతో కుమార్‌.. దంప‌తులు.. బ‌హిరంగంగానే రోజాపై విమ‌ర్శ‌లు చేశారు. తాము రోజా గెలుపు కోసం ప్ర‌య‌త్నించి ఎంతో కృషి చేశామ‌ని.. అయితే.. క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆరోపించారు. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా రోజా వ‌ర్సెస్ కుమార్ వ‌ర్గంగా ఇక్క‌డ రాజ‌కీయం సాగుతోంది. ఇక‌, పెద్దిరెడ్డితో రోజాకు ఉన్న విబేదాలు.. ఈ ఫ్యామిలీకి బాగా క‌లిసి వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల కుమార్ స‌తీమ‌ణి శాంతికి ఈడిగ కార్పొరేష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌గ్గాలు ఇప్పించ‌డం ద్వారా పెద్దిరెడ్డి గ‌ట్టి సంకేతాలు ఇచ్చిన‌ట్టయింది. దీంతో ఇప్పుడు ఈ వ‌ర్గం.. సొంత‌గా కార్య‌క్ర‌మాలు చేయ‌డంతోపాటు.. రోజాను కూడా లెక్క‌చేయ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌ర్గాలు ఏర్ప‌డి.. శాంతిని బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాను త‌ప్పించేందుకు, ఆ టికెట్‌ను త‌న స‌తీమ‌ణికి ఇప్పించుకునేందుకు కూడా కుమార్ ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో రోజాకు కంటిపై కునుకు లేకుండా పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో సొంత ఇల్లు క‌ట్టుకున్నారు. వారానికి రెండు రోజులు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్య‌టిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కుమార్ వ‌ర్గం పెరుగుతోందే త‌ప్ప‌.. రోజా వ‌ర్గంలో దూకుడు చూపించే నేత‌లు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. రోజా.. మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు వెళ్లిపోతే..ఇక్క‌డ పెత్త‌నం అంతా కుమార్ వ‌ర్గానికి ద‌క్కుతోంది. మొత్తానికి రోజాకు భారీ సెగ పెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.