కత్తి మహేష్‌కు సాయం కరెక్టేనా?

ప్రముఖ క్రిటిక్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్‌ గత వారం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తలతో పాటు కళ్లు, ముక్కుకు తీవ్ర గాయాలవడంతో ఆయా ప్రదేశాల్లో శస్త్ర చికిత్సలు జరిగాయి. ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు భారీగానే ఖర్చవుతున్నట్లు వార్తలొచ్చాయి.

మహేష్‌ వైద్య ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.17 లక్షలు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. పేదలకు అత్యవసర స్థితిలో సాయం అందించేందుకు ఉద్దేశించిన సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న మహేష్‌కు ఇవ్వడం, అందులోనూ రూ.17 లక్షల మొత్తం రిలీజ్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మామూలుగానే కత్తి మహేష్‌ను వ్యతిరేకించే వారి సంగతి పక్కన పెడితే.. తటస్థులు కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికే ఈ నిధి నుంచి సాయం అందించాలని ఉంటుంది. నిజానికి ఈ నిధి నుంచి సాయం కోరుతూ ఇచ్చిన వెయ్యికి పైగా దరఖాస్తులు ఏపీ ప్రభుత్వం వద్ద ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నాయట.

నిధుల కొరత వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేయట్లేదని ప్రభుత్వం అంటూ వస్తోంది. దీనిపై ఇంతకుముందు ఆందోళనలు కూడా జరగడం గమనార్హం. వాళ్లందరికీ సాయం చేయకుండా.. వైకాపాకు మద్దతుగా మాట్లాడుతూ, ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడన్న కారణంతో కత్తి మహేష్‌కు ప్రభుత్వం సాయం చేస్తోందని విమర్శిస్తున్నారు.

లక్షా రెండు లక్షలు సాయం కోరుతూ పేదలు పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి కత్తి మహేష్‌కు ఏకంగా రూ.17 లక్షలు విడుదల చేయడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా కత్తి మహేష్‌ ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న సంగతీ ప్రస్తావిస్తున్నారు. ఆయనకు ఇల్లుంది. ఇన్నోవా కారు, దానికి డ్రైవర్ కూడా ఉన్నారు.

పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించుకున్న కత్తికి ప్రస్తుతం దాన్నుంచే చికిత్స జరుగుతోంది. పరిచయాలు, పలుకుబడి పెద్ద స్థాయిలో ఉన్న కత్తికి సాయం చేయడానికి చాలామందే సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తికి పేదల కోసం ఉద్దేశించిన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇంత పెద్ద సాయం అవసరమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరో?