‘మా’ ఎన్నికలపై ఎందుకింత క్రేజు?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చర్చ జరిగేలా ఉంది. రాజకీయ నాయకులు పోటీ పడే ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇవి జనాల దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు మూడు నెలల ముందే ఈసారి వేడి రాజుకోవడం విశేషం. ముందుగా ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోగా.. తర్వాత మంచు విష్ణు లైన్లోకి వచ్చాడు.

ఆపై జీవిత, హేమ లాంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సాయికుమార్ ఏమో ‘మా’ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈసారి అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడం.. ఇండస్ట్రీ ఈ విషయంలో వర్గాలుగా విడిపోవడం.. ఆరోపణలు ప్రత్యారోపణలు.. విమర్శలు ప్రతి విమర్శలు గట్టిగానే ఉండబోతుండటం ఖాయంగా కనిపిస్తోంది.

ఐతే ‘మా’ ఎన్నికలపై ఎందుకింత క్రేజు.. వీటిని ప్రముఖులు ఎందుకింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎంపికైతే అదో పెద్ద హోదా అవుతుంది. డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశముంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా ఇంకా ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి అవకాశముంటుంది. మంత్రులుగా కూడా అధికారం చలాయించవచ్చు. కానీ ‘మా’లో పదవితో ఇలాంటి ప్రయోజనాలేమీ ఉండవు.

సినిమాల ద్వారా కోట్లు సంపాదించే నటులు.. ‘మా’ ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడానికి ఛాన్సే ఉండదు. ఇక ఇదేమైనా పెద్ద హోదానా అంటే అదీ కాదు. దీని ద్వారా వచ్చే పలుకుబడి కూడా ఏమీ ఉండదు. ఇంతకుముందు అధ్యక్ష పదవిలో కొనసాగిన రాజేంద్ర ప్రసాద్, నరేష్‌లు పెద్దగా సాధించిందేమీ లేదు. ఉన్నాం అంటే ఉన్నాం అనిపించారు. సినీ రంగం తరఫున ముఖ్యమైన కార్యకలాపాలన్నీ చిరంజీవి పేరు మీద జరుగుతున్నాయి. దాసరి తర్వాత సినీ పెద్ద స్థానాన్ని ఆయనే భర్తీ చేస్తున్నారు. అలాంటపుడు ‘మా’ అధ్యక్షుడి పదవిని చేజిక్కించుకుని సాధించేదేంటి.. దీనికి ఇంత క్రేజేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి వాళ్ల ఉద్దేశాలేంటో?