జ‌గ‌న్‌… ‘దైవదూత‌’… RRR తాజా లేఖ‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు..తాజాగా సీఎం జ‌గ‌న్‌కు మ‌రో లేఖ‌ను సంధించారు. అయితే.. దీనిలో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను చాలా చిత్రంగా వ‌ర్ణించారు. జ‌గ‌న్‌కు మంచిపేరు రావాల‌ని కోరుకుంటున్నాన‌ని..దైవ‌దూత‌గా ఆయ‌న నిలిచిపోవాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. అయితే.. ఇవ‌న్నీ సాకారం కావాలంటే.. జ‌గ‌న్ పాల‌న‌లో మూత‌బ‌డిన అన్నా క్యాంటీన్ల‌ను.. పేరు మార్చి అయినా..ప్రారంభించాల‌ని.. ర‌ఘురామ సీఎం జ‌గ‌న్‌కు సూచించారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అమ‌లైన అన్న క్యాంటీన్ల బదులు ‘జగనన్న క్యాంటీన్లు’ ప్రారంభించాలని ర‌ఘురామ‌ విజ్ఞప్తి చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ప్రారంభించాలని కోరారు. ‘నవ ప్రభుత్వ కర్తవ్యాల’ పేరుతో సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ ఇటీవ‌ల లేఖ‌లు రాస్తున్న విష‌యం తెలిసిందే. ఈ లేఖ‌లో .. అన్న క్యాంటీన్ల బదులు జగనన్న క్యాంటీన్లు ప్రారంభించాలని కోరారు. ఆకలితో ఉన్నవారికి మంచి ఆహారం అందించడం ఎంతో అవసరమని హితవు పలికారు.

లేఖ ద్వారా క్యాంటీన్ల విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. స‌మాజంలో రాష్ట్రంలో దేశంలో ‘ మంచి పేరుతోపాటు ‘దైవదూత’ అని జన బాహుళ్యంలో స్థిరపడిపోతుంది. మిమ్మ‌ల్ని దైవ‌దూత‌గా చూడాల‌ని కోరుకునే వారిలో నేనూ ఉన్నారు. తక్షణమే జగనన్న క్యాంటీన్ స్కీమ్ ప్రారంభించాలని సూచిస్తున్నా. పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మానవత్వం ప్రదర్శించేందుకు వేదిక అవుతుంది. వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ప్రారంభించాలి. అని రఘురామ జ‌గ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు రాసిన ఏలేఖ‌పైనా.. ప్ర‌భుత్వం నుంచి సూటిగా స్పంద‌న ల‌భించ‌లేదు. కానీ, నిన్న .. మండ‌లి ర‌ద్దు కోరుతూ.. ర‌ఘురామ రాసిన లేఖ‌పై ప‌రోక్షంగా.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. మండ‌లి ర‌ద్దుకు క‌ట్టుబ‌డ‌తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.