తెలంగాణ‌కు వరాలు ఇచ్చి హైద‌రాబాద్‌కు షాకిచ్చిన కేసీఆర్‌

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న తెలంగాణ‌లో లాక్ డౌన్ నిబంధ‌న‌ల అమ‌లు విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. త‌న అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశం అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

తెలంగాణ‌లోని కంటైన్మెంట్ జోన్లు మిన‌హా మిగ‌తా అన్ని జోన్ల‌ను గ్రీన్ జోన్లుగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే, ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌కు వ‌రాలు ఇచ్చిన కేసీఆర్ హైద‌రాబాద్ విష‌యంలో మాత్రం ఆంక్ష‌లు విధించారు. ఇక నుంచి కరోనాతో కలిసి జీవించాల‌ని పేర్కొన్న కేసీఆర్ ఇప్పట్లో మందు రాదని, అలాగని బతకలేకుండా ఉండలేమని అన్నారు.

`రాష్ట్రంలో అన్ని షాపులు, అన్ని వ్యాపారాలు ప్రారంభించుకోవ‌చ్చు. హైదరాబాద్ లో ప్రత్యామ్నాయ పద్దతుల్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. సెలూన్లు కూడా తెరుచుకోవచ్చు హైదరబాద్ మినహా రాష్ట్రంలో అన్ని బస్సులు నడుస్తాయి. ఇతర రాష్ట్రాల నుండి బస్సులకు అనుమతి లేదు. సినిమా హాల్, ఫంక్షన్ హాల్‌ల‌కు అనుమతి లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

టాక్సీలు, కారుల‌ల్లో 1+3 చొప్పున అనుమతి ఉంటుంద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ-కామర్స్‌లో అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్ప‌ష్టం చేశారు. కర్వ్యూ రాష్ట్రం అంతా యథాతథంగా ఉంటుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

`ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలకు లోబడి తమ కార్యకలపాలను కొనసాగించవచ్చు. అన్ని రకాల ప్రార్థన మందిరాలు, ఉత్స‌వాలు బంద్ ఉంటాయి. సభలు, ర్యాలీలు, సమావేశాలు విద్యా సంస్థలు బంద్ చేయాల్సిందే. జన సమూహానికి ఆస్కారం ఉన్న అన్ని ప్రదేశాలు బంద్ చేయాల్సిందే. బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధరించాలి లేకుంటే 1000 రూపాయల జరిమాన త‌ప్ప‌దు అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగ‌త శానిటైజేశన్ పాటించాలని తెలిపారు.

ప్రతి షాపులో విరివిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, కోవిడ్ రూల్స్ ప్రతి ఒక్క షాపు పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. నిబంధ‌న‌ల వెసులుబాటు క‌ల్పించారు కదా అని అనవసరంగా రోడ్ల మీదకు రావద్దు. వృద్ధులు, చిన్నవారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ప్రజలందరూ చక్కటి సహకారం అందిస్తున్నారు. అందరికీ చేతులెత్తి మొక్కుతున్న...స్వీయ నిర్బంధం పాటించి కరోనా రాకుండా కాపాడుకుందాం అని విజ్ఞ‌ప్తి చేశారు. మే 31 త‌ర్వాత లాక్ డౌన్ అమ‌లు విష‌య‌మై త‌దుప‌రి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.