కేశినేనికి పోటీగా ఆ క‌మ్మ నేత రెడీయేనా ?

ఏపీలో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే ఫోక‌స్ పెట్టేశారు. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ చెంత చేరిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయిన మూడు లోక్‌స‌భ సీట్ల‌పై కూడా జ‌గ‌న్ దృష్టి పెడుతున్నారు. కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం ఎంపీ సీటులో టీడీపీ కీల‌క‌నేత రామ్మోహ‌న్ నాయుడును ఓడించేందుకు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్‌తో పాటు ఉప ముఖ్య‌మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ త‌న‌యుడు ఇద్ద‌రిని జ‌గ‌న్ ఎంక‌రేజ్ చేస్తూ వ‌స్తున్నారు. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని రామ్మోహ‌న్ నాయుడిపై పోటీ పెట్టి ఓడించాల‌న్న‌దే జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌గా తెలుస్తోంది.

ఇక వైసీపీ ఓడిన కీల‌క‌మైన విజ‌య‌వాడ‌, గుంటూరు ఎంపీ సీట్ల‌పై కూడా జ‌గ‌న్ తో పాటు వైసీపీ కీల‌క నేత‌లు దృష్టి సారిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో సామాజిక ఈక్వేష‌న్లు మిస్ కావ‌డంతోనే ఈ ఎంపీ సీటును స్వ‌ల్ప తేడాతో కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్న సందేహం వైసీపీ నేత‌ల్లో ఉంది. అందుకే ఈ సారి ఈ క్యాస్ట్ ఈక్వేష‌న్ బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా పాటించాల‌ని వైసీపీ భావిస్తోంది. ఇక కీల‌క‌మైన విజ‌య‌వాడ సీటును కూడా తాము స్వ‌యం కృతాప‌రాధంతోనే కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్న సందేహం అయితే జ‌గ‌న్‌కు ఉంది. చివ‌ర్లో వ‌చ్చిన పీవీపీకి అయిష్టంగానే సీటు ఇవ్వ‌గా.. ఆయ‌న ఓడిపోయారు.

కేశినేని ప్ర‌జ‌ల్లో ఉండే నేత‌.. ఆయ‌న‌కు ఉన్న బ‌ల‌మైన మాస్ ఫాలోయింగ్‌తోనే ఆయ‌న వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌య‌వాడ ఎంపీగా స్వ‌ల్ప తేడాతో గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టి నుంచి కూడా ఆయ‌న ఏదో ఒక అంశంతో వార్తల్లోనూ, ప్ర‌జ‌ల్లోనూ నానుతున్నారు. ఈ సారి కేశినేనికి చెక్ పెట్టాలంటే క‌మ్మ వ‌ర్గంలోనూ.. కాస్త ప్ర‌జ‌ల్లో మంచి పేరున్న నేత‌ల‌నే రంగంలోకి దింపాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే దాస‌రి బాల‌వ‌ర్థ‌న్ రావుతో పాటు ఆయ‌న సోద‌రుడు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త దాస‌రి జై ర‌మేష్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

బాల‌వ‌ర్థ‌న్ కంటే జై ర‌మేష్ పేరును ప్ర‌తిపాదించేందుకే స్థానిక నేత‌లు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. జై ర‌మేష్‌ గతంలో టీడీపీ తరుపున ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర చేతిలో ఓడిపోయారు. వ‌ల్ల‌భ‌నేని వంశీతో ఉన్న విబేధాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌లకు ముందే వీరు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో ఈ సోద‌రులు ఏ పార్టీలో ఉన్నా అజాత శ‌త్రువులు అన్న పేరొందారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ సైతం దాసరి జై ర‌మేష్‌కే విజ‌య‌వాడ పార్ల‌మెంటు ప‌గ్గాలు అప్ప‌గించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.