ఎటాక్ సోనూ సూద్

కరోనా మహమ్మారి దేశాన్ని పీడించడం మొదలయ్యాక ఏడాది కిందట్నుంచి అసాధారణ రీతిలో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ జనాల్లో తిరుగులేని ప్రేమాభిమానాలు సంపాదించుకున్నాడు సోనూ సూద్. అతడి నుంచి సాయం పొందిన వాళ్లలో తెలుగువాళ్లు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఏపీ, తెలంగాణలను తన సెకండ్ హోమ్ అంటూ ఇక్కడి వారిపై ప్రత్యేక ప్రేమనే చూపిస్తున్నాడు సోనూ. ఎంతోమంది సోనూ నుంచి తాము పొందిన సాయం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఐతే సోనూ ఎంత మంచి చేస్తున్నప్పటికీ అందులోనూ లోపాలు వెతుకుతూ.. అతడి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన వాళ్లు.. ఆ తర్వాత బీజేపీ వాళ్లు అతణ్ని టార్గెట్ చేశారు. ఒక మీడియం రేంజ్ యాక్టర్ అయిన సోనూ ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నాడని ప్రశ్నించడం.. అతడివన్నీ ఫేక్ ప్రచారాలని ఆరోపించడం లాంటివి ఇప్పటికే చూశాం.

ఐతే జనాలు సోనూ పట్ల విశ్వాసంతో ఉన్నారనడానికి సామాజిక మాధ్యమాల్లోనే ఎన్నో రుజువులు కనిపిస్తున్నాయి. సోనూను వ్యతిరేకించడం ద్వారా చెడు కావడం తప్పితే రాజకీయ పార్టీలకు దక్కే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ కొందరు అతణ్ని టార్గెట్ చేయడం ఆపట్లేదు. ఇప్పుడా జాబితాలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా వచ్చారు. ఏపీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు పెడతానని సోనూ అన్నపుడే.. ఇదెక్కడ ప్రభుత్వ వైఫల్యానికి సూచిక అవుతుందో అని సోనూను కొందరు వైకాపా మద్దతుదారులు వ్యతిరేకించడం కనిపించింది. కాగా తాజాగా సోనూ చంద్రబాబును పొగడ్డం.. ప్రతిగా ఆయన్ని బాబు ప్రశంసించడం వైకాపా మద్దతుదారులకు రుచించడం లేదు.

అందులోనూ తాజాగా కూకట్‌పల్లిలో ఓ కరోనా బాధితుడికి సాయం చేయడం గురించి సోనూ చెబుతూ.. తాము ఇక్కడ కలిసి పని చేసే వరుణ్ అనే వ్యక్తి ప్రస్తావన తెచ్చాడు. అతను తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో వైకాపా వాళ్లకు సోనూను వ్యతిరేకించడానికి ఇంకో కారణం దొరికనట్లయింది. సోనూ మీద వైకాపా సోషల్ మీడియా టీం ఎటాక్ మొదలుపెట్టింది. వారి హ్యాండిల్స్ నుంచి వరుసగా సోనూ మీద నెగెటివ్ ట్వీట్స్ పడుతున్నాయి. సోనూ కమ్మ కులానికి చెందినవాడని, అతడివన్నీ ఫేక్ ప్రచారాలని.. ఇలా తనను టార్గెట్ చేస్తున్నారు. ఐతే జనాలు హీరోలా చూస్తున్న వ్యక్తి గురించి ఇలాంటి ప్రచారం చేస్తే అది బూమరాంగ్ అవుతుందని గుర్తిస్తే మంచిదేమో.