జ‌గ‌న్ స‌ర్కారు పై క్రికెటర్ సీరియ‌స్‌..

సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ సీరియ‌స్ అయ్యారు. ఈ ప్ర‌భుత్వానికి మాన‌వ‌త్వం లేదా? అంటూ.. ఆయ‌న ఓ వీడియోను మీడియాకు విడుద‌ల‌కు చేశారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ విష‌యాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఎమ్మెస్కే ప్ర‌సాద్‌.. ఏపీలో జ‌రుగుతున్న కూల్చివేత‌ల‌పై తొలిసారి పెద‌వి విప్పారు. విశాఖప‌ట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.

‘హిడెన్ స్ప్రౌట్స్’ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 150కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని ప్ర‌సాద్‌ తెలిపారు. పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్‌ జీవిత మంతా స్కూల్‌కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్‌ గుర్తుచేశారు. అందుకే శ్రీనివాస్‌కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. ఉచితంగా ఇక్క‌డ మాన‌సిక దివ్యాంగుల‌కు శ్రీనివాస్ ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నార‌ని తెలిపారు.

అలాంటి పాఠ‌శాల‌ల‌ను కూల్చివేయ‌డంపై సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని ప్రసాద్‌ కోరారు. విశాఖలో మానసిక దివ్యాంగులకు చదువు చెప్పే పాఠశాలను శనివారం జీవీఎంసీ అధికారులు కూలగొట్టిన విష‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంద‌ని పేర్కొన్న ప్ర‌సాద్‌.. దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఆ మాత్రం మానవత్వం కూడా కూల్చివేతల కోసం వచ్చిన అధికారులు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెస్కే ప్ర‌సాద్ వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.