ఆనందయ్య మందుపై ఇన్ని వివాదాలా ?

ఆనందయ్య మందుపై ఎందుకు ఇన్ని వివాదాలు ముసురుకుంటున్నాయో అర్ధం కావటంలేదు. గడచిన 15 రోజులుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందుకు వచ్చినంత పబ్లిసిటీ మరే మందుకు రాలేదు. ఇదే సమయంలో అంత వివాదాస్పదమైన అంశం కూడా మరోటిలేదు. ఆనందయ్య మందుకు పబ్లిసిటీ రావటంలో సోషల్ మీడియా, మీడియాదే ప్రధాన పాత్ర. అయితే వివాదాస్పదం కావటంలో తెలుగుదేశంపార్టీ నేతలదే కీలక పాత్రగా చెప్పాలి.

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు ద్వారా ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనరెడ్డికి ఎక్కడ ప్రచారం వచ్చేస్తుందో అన్న ఆందోళన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో పెరిగిపోయింది. దాంతో కాకాణిని టార్గెట్ చేయటానికి ఆనందయ్య మందును సోమిరెడ్డి ఉపయోగించుకునే ప్రయత్నంచేశారు. ఆనందయ్య మందును ఉపయోగించుకుని కాకాణి క్రేజ్ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటో నానా గోల చేశారు.

అయితే కాకాణి ప్రయత్నాల్లో తప్పేముందో మాత్రం చెప్పలేకపోయారు. ఎందుకంటే కృష్ణపట్నం మేజర్ పంచాయితి సర్వేపల్లి నియోజకవర్గంలోకే వస్తుంది. అక్కడి అధికారపార్టీ ఎంఎల్ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి. తన నియోజకవర్గానికి చెందిన ఆనందయ్య ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయిపోవటంతో కాకాణి అడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నించటంలో తప్పేముంది. రాజకీయనేతలు ఎప్పుడూ పాజిటివ్ ప్రచారం కోసం ప్రయత్నాలు చేసుకుంటునే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

కాకపోతే తనకు, కాకాణికి ఉన్న వైరాన్ని ఆనందయ్యను అడ్డుపెట్టుకోవాలని సోమిరెడ్డి ప్రతయ్నించటంతోనే వివాదం పెరిగిపోయింది. అప్పటి నుండి ప్రతిరోజు ఏదోక వివాదాన్ని సోమిరెడ్డి తెరపైకి తెస్తునే ఉన్నారు. ఇదే సమయంలో ఆనందయ్య మందుకు నకిలీ మందును తయారు చేసి వ్యాపారం చేసుకుంటున్నారంటు టీడీపీ నేతలు వైసీపీ నేతలపై ఒక్కసారిగా ఆరోపణలు, విమర్శలను పెంచేశారు. ఏ నేత ఆనందయ్య మందుకు నకిలీ మందును తయారు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం టీడీపీ నేతలెవరు చెప్పలేదు.

ఏదో వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందును అమ్మి కాకాణి రు. 120 కోట్లు దోచుకోవటానికి కాకాణి ప్రయత్నించారని సోమిరెడ్డి ఆరోపించారు. అయితే సోమిరెడ్డి ఆరోపణలను స్వయంగా ఆనందయ్యే ఖండించటం గమనార్హం. ఆరోపణలు చేయటం ద్వారా ప్రచారం పొందాలన్న యావ మాత్రమే కనబడుతోంది టీడీపీ నేతల్లో. తాము చేసే ఆరోపణలకు సరైన ఆధారాలను చూపాలని మాత్రం అనుకోవటంలేదు. ఇలాంటి కారణంగానే ఇపుడు సోమిరెడ్డిపై కేసు నమోదైంది. మరీ వివాదం చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.