సీఐడీ అధికారులకు షాకిచ్చిన రఘురామ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు… ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కి ఎంపీ రఘురామ లీగల్ నోటీసులు పంపారు. త‌న‌ అరెస్టు సమయంలో తన దగ్గర నుంచి తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్‌ వద్ద జమ చేయాలంటూ నోటీసు పంపారు. ఫోన్‌లో విలువైన సమాచారం ఉందని రఘురామ తెలిపారు.

త‌న మొబైల్‌ కోడ్‌ ఓపెన్‌ చేయాలని కస్టడీలో హింసించారని అని లీగల్‌ నోటీసులో పేర్కొన్న‌ రఘురామ… ఆ ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోన్ లో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందన్నారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రఘురామకృష్ణరాజు సీఐడీ అధికారుల‌ను హెచ్చరించారు.

కాగా.. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును గత నెలలో ఏపీ సిఐడి హైదరాబాదులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబదు నుంచి రఘురామ కృష్ణంరాజును గుంటూరు తీసుకుని వెళ్లి అక్కడ విచారించారు. రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చుతూ కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే, రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మీద విడుదలైన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స జరిగిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లారు.