ఈటలను బీజేపీ అవమానిస్తోందా ?

‘పార్టీ నియమావళి ప్రకారం ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన తర్వాతే మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారు’. ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు. బండి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే నియమావళి పేరుతో ఈటలను బీజేపీ అవమానిస్తోందనే చర్చ పెరిగిపోతోంది. ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకునేటపుడు ముందు పదవికి రాజీనామా చేయాలనే నియమావళి ఒకటుందని కూడా చాలామందికి తెలీదు.

ఎందుకంటే ఇలాంటి నియమావళిని పాటించినట్లు ఎక్కడా వినలేదు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే రెండోసారి గెలిచింది. రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వెంటనే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించారు. మరి వాళ్ళు అప్పుడు ఎంపి పదవులకు రాజీనామాలు చేయలేదు. బండి చెబుతున్న పార్టీ నియమావళి అపుడు వారికి ఎందుకు వర్తింపచేయలేదు ?

ఇదే నియమావళి పశ్చిమబెంగాల్లో వర్తించదా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 29 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను తృణమూల్ కాంగ్రెస్ లో నుండి బీజేపీలోకి లాక్కున్నారు. పార్టీ ఫిరాయించేటపుడు ఎంఎల్ఏలు కానీ ఎంపిలు కానీ తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. పైగా పార్టీలు ఫిరాయించిన వారందరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే బీజేపీ కండువాలు కప్పుకున్నారు.

ఏపి, బెంగాల్లో ప్రజాప్రతినిధులకు వర్తించని పార్టీ నియమావళి గురించి తెలంగాణాలో మాత్రమే బండి సంజయ్ ఎందుకని ప్రస్తావిస్తున్నట్లు ? ఏపిలో నలుగురు రాజ్యసభ ఎంపిలు తన పార్టీలోకి ఫిరాయించటం బీజేపికి చాలా అవసరం. అలాగే తృణమూల్ ఎంఎల్ఏలు, ఎంపిలు చేరటం కూడా బీజేపీకి చాలా అవసరం. కాబట్టి వాళ్ళు పార్టీలు ఫిరాయించినా రాజీనామాలు అడగలేదు. నియమావళి పార్టీ ఫిరాయించేవాళ్ళకు కాదు పార్టీలో చేరేవారికి మాత్రమే వర్తిస్తుందన్నట్లుగా ఉంది బండి వ్యాఖ్యలు.

ఇక తెలంగాణా బీజేపీలో చేరటం రాజేందర్ అవసరమని కమలంపార్టీ నేతలు భావిస్తున్నారా ? తన అవసరార్ధం వస్తున్నారు కాబట్టే ఈటల ముందుగా రాజీనామా చేయాలని షరతు విధించినట్లున్నారు. అంటే బీజేపీ అవసరమైతే ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. అదే నేతల అవసరమైతే మాత్రం పార్టీ నియమావళని ఇంకోటని కతలు చెబుతున్నారు. మొత్తానికి పార్టీలోకి చేర్చుకునే ముందే ఈటలను నియమావళి పేరుతో బీజేపీ అవమానిస్తున్నదనే చర్చ పెరిగిపోతోంది.