రాపాక రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా ?

తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం.. రాజోలు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌. 2009లోనూ రాపాక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే.. అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మయంలో జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎన్నో సంచ‌ల‌నాల‌తో ఏర్పాటు అయిన జ‌న‌సేన పార్టీ నుంచి పార్టీ అధ్య‌క్షుడే రెండు సార్లు ఓడిపోయినా ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా చెప్పాలంటే జ‌న‌సేన చ‌రిత్ర‌లోనే తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. అయితే.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఆయ‌న అధికార వైసీపీకి అనుకూల నాయ‌కుడిగా మారిపోయారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. వైసీపీలో కీల‌క నేత‌లుగా ఉన్న అమ్మాజీ, బొంతు రాజేశ్వ‌ర‌రావు వంటి వారి మ‌ధ్య విభేదాలు.. విరోధాలు మ‌రింత పెరిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం సీఎం జ‌గ‌న్‌కు కూడా తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. రాపాకను చేర‌దీయ‌డం వెనుక‌.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మాన‌సికంగా దెబ్బ‌తీయాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నార‌న్న టాక్ తెలిసిందే. ఇక రాపాక ప‌దే ప‌దే జ‌గ‌న్మామ‌స్మ‌ర‌ణ చేస్తుండ‌డంతో ప‌వ‌న్‌.. రాపాక‌ను వ‌దిలేసుకున్నారు. దీంతో టెక్నిక‌ల్‌గా జ‌న‌సేన ఎమ్మెల్యేనే అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ ఎమ్మెల్యే అయిపోయారు.

రాపాక జ‌న‌సేన‌కు దూర‌మై జ‌గ‌న్నామ‌స్మ‌ర‌ణ చేసిన ప్రారంభంలో వైసీపీ వాళ్లు, ఆ పార్టీ అధిష్టానం కూడా ఆయ‌న్ను నెత్తిన పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత రాపాక ఏకంగా త‌న కుమారుడికి వైసీపీ కండువా క‌ప్పించారు. అయితే ఇదంతా గ‌తం ఇప్పుడున్న ప‌రిస్థితిలో రాపాక రాజ‌కీయాలు బెడిసి కొడుతున్నారు. కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో రాపాక వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి. జ‌న‌సేన త‌ర‌ఫున మ‌ద్ద‌తుగా బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు రాజోలులో ఎక్కువ స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. స్థానిక వైసీపీ కేడ‌ర్ ఆయ‌న‌కు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు. క్ష‌త్రియ వ‌ర్గంలో కొంద‌రు నేత‌లు చెప్పిన‌ట్టు రాపాక ఆడుతున్నార‌నే అక్క‌డ జ‌నాలు విసిగిపోయి ఉన్నారు. దీంతో రాపాక హ‌వా త‌గ్గిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక రెండు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వ‌ర‌రావు త‌న ప‌ట్టును నిలుపుకుంటున్నారు. బొంతును కాద‌ని రాపాక‌కు వైసీపీ టిక్కెట్ ఇస్తే ఖ‌చ్చితంగా వ్య‌తిరేకంగా చేస్తామ‌ని అక్క‌డ నేత‌లు ఓపెన్‌గానే చెపుతున్నారు. ఇక టీడీపీ నేత‌.. గొల్ల‌ప‌ల్లి సూర్యారావు సైతం ఇక్క‌డ దూకుడు పెంచారు.


ఇక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎలా ఉన్నా రాజోలులో జ‌న‌సేన ప‌ట్టు అలాగే ఉంది. ఇక్క‌డ కాపు వ‌ర్గం నేత‌లు.. గ‌త ఎన్నిక‌ల్లో రాపాక విజ‌యం కోసం కృషి చేశారు. కానీ, ఇప్పుడు వీరంతా వ‌చ్చే ఎన్నికల్లో రాపాక ఓట‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. మొత్తంగా చూస్తే.. అటు జ‌న‌సేన, ఇటు వైసీపీ కూడా రాపాక‌ను దూరం పెడుతున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. రాపాక రాజ‌కీయం ఇక ముగిసిన‌ట్టేన‌ని అంటుండ‌డం గ‌మ‌నార్హం.