వైసీపీలో వార‌సుల‌కు జ‌గ‌న్ చెక్ ?


భార‌త్‌లో వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గాంధీ, నెహ్రూల కుటుంబాల్లో ఏకంగా ఏడు ద‌శాబ్దాలుగా వార‌సులే రాజ‌కీయాలు చేస్తున్నారు.. ఇంకా చేస్తూనే ఉంటారు. ఇక జాతీయ రాజ‌కీయాలే కాకుండా.. ప‌లు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల వార‌సులు మూడో త‌రంలోనూ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, కేటీఆర్ ఇలా ఎవ‌రు చూసుకున్నా వార‌స‌త్వ రాజ‌కీయాల్లోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక ఏపీ రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా పాతుకుపోయిన నేత‌ల వార‌సుల‌కు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో మంచి ప్రాధాన్యం ఇచ్చారు. చంద్ర‌బాబు త‌న‌తో పాటు సీనియ‌ర్లుగా ఉన్న వార‌సుల త‌న‌యుల‌కు కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చే విష‌యంలో ఎక్క‌డా వెనుకా ముందు అయితే ఆలోచించ‌లేదు. అయితే జ‌గ‌న్ మాత్రం ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే పార్టీలో వార‌స‌త్వ రాజ‌కీయాల విష‌యంలో చెక్ పెట్టేస్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఎమ్మెల్యేలుగా త‌ల్లిదండ్రులు ఉంటే వారి వార‌సులు స్థానిక ప‌ద‌వులు చేప‌ట్టి చ‌క్రం తిప్పేస్తుంటారు. అయితే జ‌గ‌న్ మాత్రం ఎవ్వ‌రికి ఈ ఛాన్స్ ఇవ్వ‌లేదు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల కుమార్తె కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో కార్పోరేట‌ర్‌గా గెలిచారు. అయితే ఆమెకు డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. కోల‌గ‌ట్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెనే అసెంబ్లీకి పోటీ చేయించాల‌ని అనుకున్నా ఆ ఛాన్స్ అయితే జ‌గ‌న్, బొత్స ఇవ్వ‌లేద‌నే టాక్ ? ఇక విశాఖ ఎన్నిక‌ల్లో మంత్రి ముత్తంశెట్టి త‌న కుమార్తె ప్రియాంక‌ను ఎలాగైనా డిప్యూటీ మేయ‌ర్ చేయించుకోవాల‌ని కార్పొరేట‌ర్‌గా గెలిపించుకుంటే.. జ‌గ‌న్ అస‌లు ఆ ఛాన్సే ఇవ్వ‌లేదు. దీంతో ముత్తంశెట్టి బాధ మామూలుగా లేద‌ట‌.

ఇక చిల‌క‌లూరిపేట‌లో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ మ‌రిది గోపీ మునిసిప‌ల్ చైర్మ‌న్ అవ్వాల‌నే కౌన్సెల‌ర్‌గా గెలిచారు. అయితే జ‌గ‌న్ అక్క‌డ మైనార్టీ కోటాలో చెక్ పెట్టేశారు. ఇక తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విపై ఆశ‌ప‌డ్డ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కుమారుడికి ఆ ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో భూమ‌న వార‌సుడు కార్పొరేట‌ర్‌గా మిగిలిపోవాల్సి వ‌చ్చింది. స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారిని గుర్తించాల‌ని జ‌గ‌న్ ముందే చెప్పారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా చోట్ల జ‌గ‌న్ మాట పెడ‌చెవిన పెట్టారు. చివ‌ర‌కు చైర్మ‌న్లు, మేయ‌ర్ల ఎన్నిక‌ల్లో షీల్డ్ క‌వ‌ర్ ఎంపిక ద్వారా వాళ్ల‌కు చెక్ పెట్టేసి.. వార‌స‌త్వ‌, బంధుత్వ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టేశారు. వీళ్లు మాత్ర‌మే కాదు.. పెద్ద పెద్ద నేత‌ల‌కు చెందిన కుటుంబాల‌నే ఆయ‌న ప‌క్క‌న పెట్టేశారు. మితిమీరిన బంధు, వార‌సుల రాజ‌కీయంతో పార్టీకి, కేడ‌ర్ కు ఇబ్బంది వ‌స్తుంద‌ని.. చంద్ర‌బాబు చేసిన త‌ప్పు తాను చేయ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ ముందుగానే జాగ్ర‌త్త ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది.