మమత గెలుపుకు కారణం ఏమిటో తెలుసా ?

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ, కేరళలో పినరయి విజయన్ గెలుపుకు ముఖ్య కారణం ఏమిటో తెలుసా ? ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎస్బీఐలోని ఆర్ధికవేత్తలు పెద్ద సర్వే నిర్వహించారు. వీళ్ళ సర్వే ప్రకారం ఎన్నికల ఏడాదిలో పబ్లిసిటిపై భారీ ఎత్తున ఖర్చులు పెట్టడమే వీళ్ళ గెలుపుకు ప్రధాన కారణమని తేలిందట. మమత మూడోసారి, విజయన్ రెండోసారి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.

పోలింగ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అన్నీ రాష్ట్రాల్లో పెరిగిపోతోందని సర్వేలో అర్ధమైందట. అందుకనే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల చివరి సంవత్సరంలో జనాలను ఆకట్టుకోవటానికి ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు పెద్దఎత్తున పథకాలను ప్రవేశపెడుతున్నాయట. ఆ పథకాలకు సంబంధించిన అడ్వర్టైమెంట్లు జనాలు ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించటమే లక్ష్మంగా ఇచ్చారట.

ఉచిత గ్యాస్ పంపిణి, ఉచిత సైకిళ్ళు, ఉచిత నాప్కిన్లు, ప్రెషర్ కుక్కర్లు ఉచితం, ఉచిత కుట్టుమిషన్లు, మహిళల పేర్లతోనే ఇళ్ళపట్టాలు..ఇలా అనేక పథకాల్లో మహిళలనే ప్రధాన లబ్దిదారులుగా ప్రభుత్వాలు చేస్తున్నాయట. మహిళలను ఆకర్షించే ఇలాంటి పథకాల వల్లే అధికారంలో ఉన్న పార్టీలకే మహిళల ఓట్లు ఎక్కువగా పోలవుతున్నట్లు సర్వేలో తేలిందట.

గడచిన ఐదేళ్ళల్లో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై సర్వే జరిగిందట. ఈ సర్వేలో పై విషయాలు స్పష్టంగా బయటపడిందట. పోయిన సంవత్సరం కన్నా బెంగాల్లో ఎన్నికల ఏడాదిలో ప్రకటనలకు 8 శాతం అదనపు నిధులను మమత ఖర్చు చేశారట. అలాగే కేరళలో విజయన్ ఏకంగా 43 శాతం నిధులు అదనంగా ఖర్చు పెట్టారట. తమిళనాడులో కూడా పబ్లిసిటీపై ఖర్చుచేసినా అది కేవలం 2 శాతం మాత్రమే అదనంగా జరిగిందట.

సరే వీళ్ళ సర్వే బాగానే ఉంది కానీ అధికారపార్టీలో దమ్ము లేకపోతే, అమలు చేస్తున్న పథకాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించకపోతే జనాలు నమ్మరన్న విషయాన్ని సర్వే మరచి పోయినట్లుంది. కేవలం ప్రచారం మీదే మాత్రమే ఆధారపడితే గెలుపు సాధ్యం కాదన్న విషయం మరి వీళ్ళ సర్వేలో బయటపడిందో లేదో చెప్పలేదు.