హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్లకు శుభవార్త

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సామాన్యుడు మొదలు సెలబ్రిటీల వరకూ అందరికి హైదరాబాద్ లో ఏదో ఒక పని తప్పనిసరి. ఉద్యోగం.. వ్యాపారం.. వ్యక్తిగత పనులు.. ఇలా ఏదో ఒక కారణంతో హైదరాబాద్ కు వస్తూ పోవటం తెలిసిందే. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన లాక్ డౌన్ మాటతో ఎక్కడి వారుఅక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అత్యవసరమో.. అనారోగ్యమో.. లేదంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూసేందుకు అప్పటికప్పుడు ఈ పాస్ తీసుకొని వెళ్లటం తెలిసిందే.

అలా కాకుండా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన వారిని ఏపీకి తరలించే కార్యక్రమం ఇప్పటివరకూ షురూ కాలేదు. హైదరాబాద్ లో ఉండిపోయిన ఆంద్రా ప్రాంతానికి చెందిన 13వేల మంది (హైదరాబాద్ జిల్లాలో ఐదు వేలు.. రంగారెడ్డిజిల్లాలో ఏడు వేలు) ఈ – దరఖాస్తులు ఏపీ పోలీసుల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇంతమందికి ప్రైవేటు వాహనాల్లో ఏపీకి వచ్చేందుకు వీలుగా అనుమతుల్ని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సుల్ని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు తిప్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మరో రెండు రోజుల్లో ఆన్ లైన్ లో రిజర్వేషన్లు కూడా చేపడతారని చెబుతున్నారు. ఈ బస్సులు హైదరాబాద్ లోని మియాపూర్.. కేపీహెచ్ బీ.. లక్డీకాఫూల్.. ఎల్ బీ నగర్ మీదుగా ఏపీకి వెళతాయి.

ఈ తరలింపు ప్రక్రియ సాఫీగా సాగితే.. రానున్న కొద్ది రోజుల్లో చెన్నై.. బెంగళూరుల్లో చిక్కకుపోయిన ఆంధ్రోళ్లను కూడా బస్సుల్లో తీసుకు వస్తారని చెబుతున్నారు. అయితే.. ఏపీకి వెళ్లినంతనే పద్నాలుగు రోజుల క్వారంటైన్ కు ఓకే చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో చిక్కుకున్న ఆంధ్రోళ్లకు ఈ వార్త పండుగలాంటి వార్తగా చెప్పక తప్పదు.