మేల్కొన్న జ‌గ‌న్‌… వ్యాక్సినేష‌న్ కోసం ఏపీ ప్లాన్

క‌రోనా సెకండ్ వేవ్ విల‌య తాండవం చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో దుందుగుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి… కాస్తంత ఆల‌స్యంగా అయినా మేల్కొన్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా బాధితులు ఆక్సిజ‌న్ దొర‌క్క ఎక్క‌డిక‌క్క‌డ ప్రాణాలు విడుస్తుంటే… ప‌రిస్థితి తీవ్రత‌ను గుర్తించిన జ‌గ‌న్ స‌ర్కారు ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, ఇత‌ర‌త్రా ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఏకంగా రూ.310 కోట్ల‌ను కేటాయించింది.

కేవ‌లం ఆక్సిజ‌న్ అందిస్తే స‌రిపోదు క‌దా… క‌రోనా వ్యాప్తిని నిరోధిస్తేనే క‌దా స‌త్ఫ‌లితాలు ఇచ్చేది. ఈ దిశ‌గా ఆలోచించిన జ‌గ‌న్ స‌ర్కారు… సోమ‌వారం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌న స‌మ్మ‌ర్ధం క‌లిగిన ప్రాంతాల్లో క‌రోనా త‌న‌దైన శైలిలో విస్త‌రిస్తోంది. క‌రోనా నుంచి కాపాడుకునేందుకు వేసే వ్యాక్సిన్ కేంద్రాల వ‌ద్ద కూడా ఇదే త‌ర‌హాలో జ‌నం తండోప‌తండాలుగా గుమిగూడుతున్నారు. అంటే… క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం వేసుకునే వ్యాక్సిన్ కోసం వ‌చ్చి… ర‌ద్దీ కార‌ణంగా క‌రోనా బారిన ప‌డుతున్నార‌న్న మాట‌.

ఈ విష‌యాన్ని కాస్తంత ఆల‌స్యంగా గుర్తించిన జ‌గ‌న్ స‌ర్కారు… వ్యాక్సినేష‌న్ ద్వారా క‌రోనా వ్యాప్తి కాకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకోసం ప‌క‌డ్బందీ వ్యూహాన్ని ర‌చించింది. ఇందులో భాగంగా ఏపీలోని అన్ని జిల్లాల్లో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో వ్యాక్సినేషన్ ను నిలిపివేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. టీకా కేంద్రాల వద్ద రద్దీ, తోపులాటను నివారించే వ్యూహంలో భాగంగా ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను ప్ర‌జ‌ల‌కు వారి ఇళ్ల వ‌ద్ద‌కే పంప‌నున్న‌ట్టుగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం.. ఎవ‌రికి?.. ఏ టైమ్ కి వ్యాక్సిన్ వేస్తామ‌న్న ప‌క్కా స‌మాచారాన్ని స‌ద‌రు స్లిప్పుల ద్వారా అందిస్తుంద‌ట‌.