టీడీపీ పరిస్ధితేమిటి ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఓ విషయం అర్ధమైపోయింది. అదేమిటంటే టీడీపీ ఓటింగ్ పెద్దగా చెక్కు చెదరలేదని. నిజానికి ఎన్నికలకు ముందే వైసీపీ విజయం ఖాయమైపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని నిలువెల్లా వ్యతిరేకిస్తున్న కారణంగా తిరుపతి ఉపఎన్నికలో పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు రంగంలోకి దించారు.

ఇక్కడ టీడీపీలో ఓ సమస్య కొట్టొచ్చినట్లు కనబడింది. అదేమిటంటే ఎలాగూ ఓడిపోయే సీటే కాబట్టి పెద్దగా పోరాటం చేసేదేముంటుంది ? అనే ధోరణి చాలామంది సీనియర్లలో కనబడింది. దానికితోడు పనబాక కూడా పోటీ విషయంలో వెనకాడిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. పైగా ఎన్నికల ప్రక్రియకు మూడు నెలలకు ముందే పనబాకను అభ్యర్ధిగా ప్రకటించారు. దాంతో నేతల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోయింది.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే వెల్లడైన ఫలితాన్ని బట్టిచూస్తే టీడీపీకి 3.60 లక్షల దాకా ఓట్లొచ్చాయి. నిజానికి ఇన్ని ఓట్లు వస్తాయని చాలామంది నేతలు ఊహించలేదు. కొందరు సీనియర్లయితే 2.5-3 లక్షల ఓట్లొస్తాయని అనుకున్నారు. దానికి తగ్గట్లే 2019 ఎన్నికల్లో జరిగిన 80 శాతం ఓటింగ్ తో పోల్చితే తాజా పోలింగ్ 64 శాతమే. అంటే 16 శాతం తగ్గిపోయింది. దీంతో తమకు పోలింగ్ దగ్గరే 16 శాతం ఓట్లు బొక్కపడిందని టీడీపీ నేతలు అంచనా వేశారు.

తీరా కౌంటింగ్ లో చూస్తే 3.6 లక్షల ఓట్లొచ్చాయి. అంటే నియోజకవర్గానికి సగటున 50 వేల ఓట్లొచ్చినట్లే లెక్క. అంటే దగ్గర దగ్గర 31 శాతం ఓటింగ్ నికరంగా టీడీపీకి ఉందని అర్ధమైపోయింది. నేతలు పెద్దగా పట్టించుకోకపోయినా, అభ్యర్ధి గట్టిగా పోరాటం చేయకపోయినా, ఓటింగ్ తగ్గిపోయినా కూడా టీడీపీకి 31 శాతం ఓటింగ్ రావటం మామూలు విషయంకాదు.

ఇదే మొదటినుండి అభ్యర్ధి, నేతలు గట్టిగా ఓ పట్టుపట్టుంటే టీడీపీకి ఇంకా ఎక్కువ ఓట్లొచ్చేదే అనటంలో సందేహంలేదు. అంటే కేవలం అభ్యర్ధి, పార్టీ అలసత్వం వల్లే ఓట్లు తగ్గిపోయాయని అర్ధమైపోతోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక సంక్షేమపథకాలు అమలవుతున్నా కూడా టీడీపీ ఓటింగ్ తగ్గలేదంటే జనాల్లో పార్టీపై అభిమానం ఉన్నట్లే కదా. ఈ విషయమై చంద్రబాబు అండ్ కో జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే పార్టీ పుంజుకోవటం పెద్ద కష్టమేమీకాదు.