అప్పుడు వేస్ట్ అన్న వ్యాక్సిన్‌కే ఇప్పుడు డిమాండ్

కొన్ని నెలల కిందట త్వరలో ఇండియాలో వ్యాక్సినేషన్ మొదలవుతుందని ఆశిస్తున్న తరుణంలో.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నంలో ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అదార్ పూనవాలా ఒక కామెంట్ చేశాడు. ఇండియాలో తయారవుతున్న మరో వ్యాక్సిన్‌ మంచి నీళ్లతో సమానం అన్నట్లు ఆయన వ్యాఖ్యానించాడు.

ఆయన ఆ వ్యాక్సిన్ పేరు చెప్పకపోయినా.. అది భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ను ఉద్దేశించే అన్నది స్పష్టంగా తెలిసిపోయింది. దీనిపై భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా తీవ్రంగానే స్పందించారు. అన్ని క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న కోవాగ్జిన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేుయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

పూనావాలా కామెంట్ల వల్ల కావచ్చు.. బేసిగ్గా దేశీయ ఉత్పత్తుల మీద ఉన్న చిన్న చూపు వల్ల కావచ్చు.. మొదట్లో కోవాగ్జిన్ పట్ల జనాల్లో అంత ఆసక్తి కనిపించలేదు. వ్యాక్సినేషన్ మొదలైన కొత్తలో కోవిషీల్డ్ కోసమే అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా పరిస్థితి మారిపోయింది. అందరూ కోవాగ్జిన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆ టీకానే వేయాలని అడుగుతున్నారు. కానీ డిమాండుకు తగ్గట్లుగా కోవాగ్జిన్ సరఫరా లేదిప్పుడు. తొలి డోస్‌లో ఎక్కువ మందికి కోవాగ్జినే వేయగా.. వాళ్లకే రెండో డోస్ వేయడానికి సరపడా ఉత్పత్తి లేదు.

కోవిషీల్డ్ వేసుకుంటే జ్వరం సహా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుండం.. కోవాగ్జిత్‌తో అలాంటి ఇబ్బందులు పెద్దగా లేకపోవడం.. పైగా ఈ వ్యాక్సిన్ పనితీరు కూడా గొప్పగా ఉందని అంతర్జాతీయ సంస్థలు కితాబులిస్తుండటం, నివేదికలు బయటికి వస్తుండటంతో భారత్ బయోటెక్ వారి ఉత్పత్తి విలువే మారిపోయింది. దాని కోసం డిమాండ్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఐతే ఈ డిమాండుకు తగ్గట్లు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడమే భారత్ బయోటెక్ వారికి సవాలుగా మారింది.