విశాఖ ఉక్కు రికార్డు

ఆక్సిజన్..ఇపుడిది దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోగులకు అత్యవసరంగా మారిపోయింది. అందరు రోగులకు ఆక్సిజన్ అవసరం ఉండదన్నది వాస్తవం. కానీ కరోనా కారణంగా జ్వరం తగ్గకపోయినా, శ్వాశతీసుకోవటంలో ఇబ్బందులు మొదలైనా వెంటనే ఆక్సిజన్ చాలా అవసరం అన్నది కూడా వాస్తవమే. ఈ కారణంగానే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో కరోనా రోగంతో చనిపోతున్న వారికన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారిసంఖ్య పెరిగిపోతోది.

ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో గడచిన 12 రోజుల్లో 1300 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. గడచిన నాలుగు రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఆక్సిజన్ ఉత్సత్తిని రోజుకు 100 టన్నుల నుండి 140 టన్నులకు పెంచారు. దేశంలో మొదలైన మొట్టమొదటి ఆక్సిజన్ ట్రైన్ విశాఖ నుండి 100 టన్నుల ద్రవీకృత ఆక్సిజన్ను తీసుకుని మహారాష్ట్రకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.

కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ లెక్క ప్రకారం దేశంలోని ఉక్కు ఫ్యాక్టరీలన్నీ తమ సామర్ధ్యాన్ని మించే ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయట. ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లోని ఉక్కు ఫ్యాక్టరీల్లో 33 ఆక్సిజన్ ప్లాంట్లున్నాయి. వీటి రోజువారి ఆక్సిజన్ ఉత్సత్తి సామర్ధ్యం 2834 టన్నులు. అయితే ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్నిప్లాంట్లలో కలిపి 3474 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిచేస్తున్నారు.

విచిత్రమేమిటంటే రోజుకు వేలాది టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తవుతున్నా రోగుల అవసరాలకు అది ఏమూలకు సరిపోవటంలేదు. ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. కరోనా రోగం విషమించి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ దొరక్క చనిపోతున్న వారిసంఖ్య పెరిగిపోతుండటమే బాధాకరం. మరి ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ అంతా ఎటుపోతోంది ? అంటే ఊహించనిరీతిలో రోగుల ఆసుపత్రులకు వచ్చేస్తుండటంతో డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.

ఉదాహరణకు 10 పడకల ఆసుపత్రికి 10 మంది వస్తే వైద్యం చేయగలరు. అయితే ఒక్కసారిగా 100 మంది వచ్చేస్తే ఏం చేయగలరు ? ఇపుడు జరుగుతున్నదిదే. అందుకే ప్రభుత్వాలైనా, డాక్టర్లయినా ఏమి చేయలేకపోతున్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతిని సరిగా అంచనావేయలేకపోయినా కేంద్రప్రభుత్వానిదే తప్పంతా. తప్పును అంగీకరించని కేంద్రం ఆ నెపాన్ని రాష్ట్రాలమీదకు తోసేసి చేతులు దులిపేసుకున్నది.