ఏపీలో మ‌రో ఉప ఎన్నిక హీట్ స్టార్ట్ ?

ఏపీలోనూ.. తెలంగాణ‌లోనూ వ‌రుస ఎన్నిక‌ల‌తో రాజ‌కీయం వేడెక్కుతోంది. తెలంగాణ‌లో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల నుంచి మొద‌లైన ఎన్నికల వేడికి ఇప్ప‌ట్లో బ్రేక్ పడేలా లేదు. తాజాగా ఏపీలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి, తెలంగాణ‌లో నాగార్జునా సాగ‌ర్ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌లు స్థానిక సంస్థ‌ల‌కు పెండింగ్ ఉన్న ఎన్నిక‌లు కూడా ఈ స‌మ్మ‌ర్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల ప‌రంప‌రలోనే ఏపీలో మ‌రో అసెంబ్లీ స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఉప ఎన్నిక హీట్ అప్పుడే ప్రారంభ‌మైంది. క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గనుంది.

కరోనాతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణం చెందారు. దాంతో మరో అయిదు నెలలలో అక్కడ ఎన్నిక అనివార్యంగా జరగాలి. బ‌ద్వేల్ వైసీపీకి.. ఇంకా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడు ఎన్నిక జ‌రిగినా 30 వేల పైచిలుకు మెజార్టీయే వ‌స్తోంది. గ‌తంలో కాంగ్రెస్ అయినా.. ఆ త‌ర్వాత వైసీపీ అభ్య‌ర్థులు అయినా భారీ మెజార్టీల‌తోనే గెలుస్తున్నారు. ఎంత వైసీపీ కంచుకోట అయినా ఇక్క‌డ పోటీ లేకుండా ఏక‌గ్రీవంగా వైసీపీ గెలిచే ప‌రిస్థితి లేదు. తిరుప‌తిలో గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ ఏకంగా 2.28 ల‌క్ష‌ల మెజార్టీ వ‌చ్చింది. అక్క‌డ సిట్టింగ్ ఎంపీ మృతి చెందితేనే టీడీపీ పోటీ పెట్టింది.

ఇప్పుడు బ‌ద్వేల్‌లోనూ అదే ప‌రిస్థితి రిపీట్ కానుంది. టీడీపీ గెలిచే స్కోప్ త‌క్కువ‌. పైగా అది జ‌గ‌న్ సొంత జిల్లా. అయితే టీడీపీకి వ‌చ్చే ఓట్ల శాతం చెక్ చేసుకునేందుకు అయినా ఆ పార్టీ పోటీ పెడుతుంది అన‌డంలో సందేహం లేదు. ఇక బీజేపీ కూడా త‌మ ఓట్ల శాతం ప‌రీక్షించుకుని మురిసిపోయేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. దీంతో బీజేపీ కూడా బ‌ద్వేల్లో పోటీకి అప్పుడే లెక్క‌లు వేసుకుంటోంది. క‌డ‌ప జిల్లాకే చెందిన మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి బ‌ద్వేల్ బీజేపీ అభ్య‌ర్థిపై అప్పుడే ఫోక‌స్ పెట్టేశారు.

ఇక సీమ‌కు చెందిన విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి లాంటి నేత‌లు అప్పుడే తాము పోటీకి రెడీ అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇక టీడీపీకి కూడా గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌. ఇక్కడ నుంచి 1983, 1985, 1994, 1999 లలో నాలుగు సార్లు టీడీపీ గెలిచింది. ఆ త‌ర్వాత మాత్రం ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర్లేదు. మ‌రి రెండు ద‌శాబ్దాల త‌ర్వాత అయినా ఈ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ సంచ‌ల‌నం న‌మోదు చేస్తుందా ? లేదా పార్టీ మ‌రోసారి పోరాడి ఓడుతుందా ? అన్న‌ది చూడాలి.