టీడీపీకి మరోషాక్… కీలక నేత అరెస్ట్


తెలుగు దేశం పార్టీలో నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన నివాసం వద్ద తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఉదయం ఆయన ఇంటి వద్ద మోహరించారు. అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు ఆయనను తమ వాహనంలో తీసుకొని వెళ్ళారు. ఇకపోతే ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంఘం డైరీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంగం డైరీ లో అక్రమాలు జరిగాయి అంటూ నరేంద్రపై 408, 409, 418, 420, 465 సెకన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ను ఖండించిన సీపీఐ రామకృష్ణ
మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఒక తీవ్రవాదినో, ఉగ్రవాదినో అరెస్టు చేసినట్లుగా 100 మంది పోలీసులను మోహరింపచేసి నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయగా.. ఇటీవల మాజీ మంత్రి దేవినేని ఉమాకు సిఐడి నోటీసులంటూ హడావుడి చేశారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇదంతా టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్చలో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.