ఓట‌మి తెలిసే.. బీజేపీ నేత‌లు ఇలా చేస్తున్నారా?

ఏపీ బీజేపీ వ్య‌వ‌హారం.. బ‌ట్ట‌త‌ల వ‌చ్చాక దొరికిన దువ్వెన మాదిరిగా ఉంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న ఆకాంక్ష ఉంది కానీ.. దానికి సంబంధించిన యుద్ధం ఎలా చేయాలో తెలియ‌క బీజేపీ నేత‌లు చ‌తికిల ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి.. మ‌రో రోజు గ‌డువు ఉంద‌న‌గా ఓ అద్భుత‌మైన ఐడియా బీజేపీ నేత‌లకు వ‌చ్చేసింది. దీంతో దీనిని ప‌ట్టుకుని.. భారీ ఎత్తున స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు రువుతున్నారు. అయితే.. ఇది ఎంత‌వ‌ర‌కు వ‌ర్కువుట్ అవుతుందో చూడాలి.

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ గురుమూర్తిని ప్ర‌క‌టించారు. అయితే.. అప్ప‌ట్లో దీనిపై ఎలాంటి వివాదాలూ క‌నిపించ‌లేదు. వినిపించ‌నూ లేదు. కానీ.. ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున గురుమూర్తిపై విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. రాజకీయాల కోసం వైసీపీ నేతలు హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవ్ధర్ విమర్శించారు. మతం మార్చుకున్న వ్యక్తిని తిరుపతి ఉప ఎన్నికలో ఎస్సీ అభ్యర్థిగా నిలబెట్టి ముఖ్యమంత్రి జగన్ దళిత జాతిని మోసం చేస్తున్నారని ఆరోపించారు.

తిరుపతి లోక్సభ నియోజకవర్గ ప్రజల ప్రశ్ననే బీజేపీ తరపున అడుగుతున్నామని.. గురుమూర్తి మతంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం హిందూ మతాన్ని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. గోవింద నామాలను అవహేళన చేస్తూ మంత్రి పేర్ని నాని మాట్లాడినా.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నా.. సీఎం జగన్ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీది డ్రామా అయితే జగన్ తిరుమలకు వచ్చినప్పుడు పెట్టుకున్న నామాల సంగతేంటని ప్రశ్నించారు. అయితే.. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యం మించిపోవ‌డం.. ఇప్పుడు వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్ల బీజేపీకి వ‌చ్చే లాభం ఏంటో చూడాలి. ఓట‌మికి ఎలాగూ సిద్ధ‌ప‌డిపోయిన నేప‌థ్యంలో ఏదో ఒక క‌ల‌రింగ్ ఇవ్వాల‌నే బీజేపీ ఇలా చేస్తోంద‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు ఈ వ్యాఖ్య‌లు ఏమేర‌కు ఓట్లు రాలుస్తాయో చూడాలి.