ఎంఎల్ఏని చితక్కొట్టేసిన రైతులు

మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోందా ? క్షేత్రస్ధాయిలో తాజాగా జరిగిన ఘటన చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. పంజాబ్ లో బీజేపీ ఎంఎల్ఏపై రైతులు దాడిచేసి బాగా కొట్టారు. అంతేకాకుండా ఆయన బట్టలను చీలికలు పీలికలుగా చించేయటం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.

చిన్న ఆందోళనగా మొదలైన డిమాండ్లు చివరకు ఇపుడు పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందింది. గడచిన నాలుగు నెలలుగా ఢిల్లీ శివార్లలోని సింఘూ తదితర ప్రాంతాల్లో పట్టువిడవకుండా భారత్ కిసార్ సంఘ్ ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు తమ ఉద్యమాన్ని కంటిన్యు చేస్తున్నారు. ఆందోళనకైనా, ఉద్యమానికైనా కేంద్ర బిందువు పంజాబే అన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

అలాంటి పంజాబ్ లో ఉద్యమం మరింత ఉగ్రరూపంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగానే స్ధానిక బీజేపీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే ముక్తసర్ జిల్లాలోని మాలోట్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు ఎంఎల్ఏ అరుణ్ నారంగ్ రెడీ అయ్యారు. ఎంఎల్ఏ వచ్చిన విషయం తెలుసుకున్న రైతుల్లో కొందరు హఠాత్తుగా మీడియా సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు.

ఎంఎల్ఏతో పాటు ఆయన వాహనాలు,మద్దతుదారులపై నల్లరంగు చల్లి తమ నిరసన తెలిపారు. అయితే నల్లరంగు చల్లే క్రమంలో మద్దతుదారులకు రైతులకు గొడవ మొదలైంది. చివరకు ఈ గొడవ కాస్త పెద్దదై ఏకంగా ఎంఎల్ఏపైన దాడి చేసేదాకా వెళ్ళింది. సెక్యురిటి, మద్దతుదారులు ఎంఎల్ఏకి రక్షణగా నిలిచినా రైతులు వదల్లేదు. ఆయనపై దాడిచేసి బట్టలను చింపేశారు. మొత్తానికి ఎలాగో అక్కడినుండి తప్పించుకుని రైతులపై ఎంఎల్ఏ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశారు.