అజహరుద్దీన్‌కు కవిత చెక్


హైదరాబాద్ క్రికెట్ ఎంత దారుణమైన స్థితికి చేరుకుందో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా యువ క్రికెటర్లు ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్‌లో సత్తా చాటుకున్నారు. టీమ్ ఇండియా తలుపు తట్టారు. కానీ ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నుంచి మాత్రం క్రికెట్ ప్రతిభ వెలుగులోకి రావట్లేదు. అనుకోకుండా మహ్మద్ సిరాజ్ అనే కుర్రాడు ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకుని టీమ్ ఇండియా స్థాయికి ఎదిగాడు కానీ.. అంతకుమించి ఇక్కడి నుంచి కుర్రాళ్లెవరూ పై స్థాయికి వెళ్లట్లేదు.

మొన్న ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ క్రికెటర్లపై ఫ్రాంఛైజీలేవీ అసలు దృష్టిసారించలేదు. హైదరాబాద్ క్రికెట్ సంఘం పూర్తిగా అవినీతి, బంధుప్రీతిలో కూరుకుపోయి ప్రతిభావంతులు వెలుగులోకి రాకుండా చూస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దిగ్గజ ఆటగాడు అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అయ్యాక అయినా పరిస్థితి మారుతుందేమో అని చూస్తే అలాంటిదేమీ జరగలేదు. అజహర్ మీద కూడా ఎన్నో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్‌ను బాగు చేసేదెవరు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తోంది. కేసీఆర్ తనయురాలు త్వరలోనే హైదరాబాద్ క్రికెట్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. భ్రష్టుపట్టిపోయిన హెచ్‌సీఏ రాజకీయాల గురించి కొంత కాలంగా కవితకు ఫిర్యాదులు అందుతున్నాయట.

ఇంతకుముందు కేటీఆర్ దృష్టికి కూడా వ్యవహారం వెళ్లింది. కానీ ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఫుల్ బిజీగా ఉండటంతో దీనిపై ఫోకస్ పెట్టలేకపోయారు. ఇప్పుడు వ్యవహారం కవిత దగ్గరకు వెళ్లిందట. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. క్లబ్బులు పూర్తిగా అవినీతి మయమై అర్హత లేని వాళ్లకు పెద్ద పీట వేస్తుండటం.. హెచ్‌సీఏ పెద్దలు క్రికెట్ అభివృద్ధిపై అసలేమాత్రం దృష్టిపెట్టకపోవడం గురించి ఆమెకు పూర్తి స్థాయిలో నివేదికలు అందాయట. వీటన్నింటికీ చెక్ పెట్టాలని, హెచ్‌సీఏను ప్రక్షాళన చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండ ఉన్న నేపథ్యంలో.. అజహర్ అండ్ కోకు చెక్ పెట్టి తర్వాతి ఎన్నికల్లో తాను బలపరిచే కార్యవర్గాన్ని గెలిపించుకుని హైదరాబాద్ క్రికెట్లో మార్పు తీసుకురావాలని ఆమె భావిస్తున్నారట.