బాబులో ఏ మార్పు అవసరమో చెప్పేసిన ఆర్కే

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కేకు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యనున్న సంబంధం గురించి.. వారిద్దరి మధ్య అనుబంధం గురించి కథలుకథలుగా చెబుతుంటారు. వైసీపీని అభిమానించే వారైతే ఆర్కే అన్నంతనే ఈసడించుకుంటారు. ఆయన చెప్పే విషయాల్ని సావధానంగా వినేందుకు సైతం ఇష్టపడరు. అలాంటి వారంతా గమనించని అంశం ఏమంటే.. జగన్ ను తిట్టేసే ఆర్కే.. చంద్రబాబు లోపాల్ని తరచూ తన ఆర్టికల్ లో చర్చిస్తుంటాడు. అంతేనా.. మీరు మారాలి బాబు.. అంటూ ఏ రీతిలో మారితే బాగుంటుందో కూడా సూచనల్ని ఓపెన్ గానే ఇచ్చేస్తుంటారు.

ఎప్పుడూ జగన్ ను తిట్టటం.. బాబును నెత్తిన పెట్టుకోవటం లాంటివే తప్పించి.. మరింకేమీ చేయరన్న నిశ్చితాభిప్రాయం ఆర్కేను ఇష్టపడని వారి నోట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఆయన చంద్రబాబును తన అక్షరాలతో తలంటు పోస్తారన్న విషయాన్ని గుర్తించరు. ఎక్కడిదాకానో ఎందుకు? ఈ రోజు తన రాసే వీకెండ్ కామెంట్ లో చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

టీడీపీ అధినేత చంద్రబాబులో రావాల్సిన మార్పు గురించి ఆయన పెద్ద విశ్లేషణే చేశారు. బాబులో అర్జెంట్ గా తీసుకురావాల్సిన మార్పుల గురించి వివరించారు. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నుంచి తెలుగుదేశం పార్టీ గానీ, ఆ పార్టీ అధినేత గానీ నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయా? అన్న అంశాన్ని చూద్దాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీని, రాజకీయాలను పూర్తిగా విస్మరించడం వల్ల ప్రస్తుత దుస్థితి దాపురించింది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేషించి విరుగుడు చర్యలకు ఉపక్రమించకుండా ప్రజలను నిందించే దుస్సాహసానికి కొంత మంది నాయకులు తెగబడ్డారు. రాజకీయ పార్టీల అధినేతలపై, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అభిమానం, గౌరవం అయినా ఉండాలి లేదా భయం కాని ఉండాలి’’

‘‘చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఈ రెండూ లేవు. ఉండివుంటే ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడలో కేశినేని నాని, ఆయనతో విభేదిస్తున్న బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా వంటి వారు అలా బజారుకెక్కి ఉండేవారు కారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు కూడా మునిసిపల్‌ ఎన్నికల్లో చేతులెత్తేశారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ మోస్ట్‌ నాయకుడైన యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో వైసీపీకి దాదాపు 78 శాతం ఓట్లు లభించాయంటే అందుకు ఎవరు కారణం?’’

‘‘అధికారంలో ఉన్నప్పుడు హోం మంత్రిగా పనిచేసిన చినరాజప్ప సొంత నియోజకవర్గం పెద్దాపురంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. తెలుగుదేశం నాయకులు గట్టిగా నిలబడి పోరాడిన మునిసిపాలిటీలలో ఓట్‌ షేరింగ్‌ వేరే రకంగా ఉంది. గుంటూరు నగర పాలక సంస్థలో.. మాకు ఒక పది డివిజన్లు వదిలేయండి. మిగతాచోట్ల మేం బలహీనులనే పోటీకి పెడతాం’.. అని తెలుగుదేశం నాయకులే అధికార పార్టీ వారితో రాజీ కుదుర్చుకోవడం నిజం కాదా?’’

‘‘పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకోలేదా? నిలబడి కొట్లాడవలసిన వాళ్లు లాలూచీ పడుతుంటే ప్రజలు తెలుసుకోలేరా? తన తరఫున ప్రజలే పోరాడాలని కోరుకోవడం ఏమిటి? అధికార పార్టీ నుంచి తమకు వేధింపులు ఎదురుకాకుండా నాయకులు రాజీ పడుతుంటే కార్యకర్తలు మాత్రం సర్వం ఒడ్డి పోరాటం చేయాలని కోరడం ఏమి న్యాయం?’’

‘‘విశాఖపట్నంలో నాయకుల వైఫల్యం, లాలూచీ కారణంగానే నగర పాలక సంస్థ చేజారింది. ఓటేయడానికి విశాఖ వాసులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిలో భరోసా కల్పించే నాయకుడు ఏడి? ఇవన్నీ వదిలేసి జనసేన పార్టీ ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయామని చెప్పడం ఆత్మవంచన కాదా? అలాంటప్పుడు 30 డివిజన్లు ఎలా గెలుచుకోగలిగారు? తూర్పు గోదావరి జిల్లాలో రెండు మూడు మునిసిపాలిటీల్లో మాత్రమే జనసేనకు గణనీయంగా ఓట్లు లభించాయి. తుని మునిసిపాలిటీలో ఆ పార్టీకి కేవలం 500 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా అక్కడ 20 శాతం ఓట్లు కూడా పొందలేకపోవడం తెలుగుదేశం నాయకుల వైఫల్యం కాదా?’’

‘‘ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. తప్పులన్నీ నాయకుల వైపే ఉన్నాయనడానికి కూడా లేదు. అధినేత చంద్రబాబు వైపు కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. అధినేత బలంగా ఉంటేనే ఏ ప్రాంతీయ పార్టీ అయినా బలంగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీని నిలబెట్టడానికి చంద్రబాబు పడుతున్న శ్రమను అభినందించాల్సిందే. అయితే ఆ పరిస్థితికి తానెంతవరకు కారణమో చంద్రబాబు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీ నాయకులకు లేదనే చెప్పవచ్చు’’

‘‘మరో రకంగా చెప్పుకొంటే తనపై నమ్మకం లేకుండా ఆయనే చేసుకున్నారు. పార్టీ కోసం చొక్కాలు చించుకొని పనిచేసినా కీలక సమయంలో పక్కనపెట్టరన్న గ్యారంటీ లేదని పలువురు నాయకులు వాపోతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో అంతులేని తాత్సారం చేయడమే కాకుండా తప్పు చేసిన వారిపైన, పార్టీకి నష్టం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడంలో కూడా చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తుంటారు. దీంతో బలమైన నాయకులు కూడా తెగబడి పనిచేయడానికి జంకుతున్నారు’’