ఏబీఎన్, టీవీ5లకు ధన్యవాదాలు-కొడాలి నాని

మన టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో ఏవి ఏ పార్టీలకు అనుకూలమో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని ఛానెళ్లు, పత్రికలు నేరుగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్నేమో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆ ఛానెళ్ల మీద ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. వాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు.

ఇక కొడాలి నాని లాంటి వాళ్లయితే ఆ ఛానెళ్లను ఎలా టార్గెట్ చేస్తారో తెలిసిందే. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటే ఆయనకు అస్సలు గిట్టదు. ఎన్నోసార్లు ఆ ఛానెల్ మీద విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తి ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏబీఎన్‌కు, టీవీ5కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ఛానెళ్లను పొగిడారు. ఇవి ఇదే పనితీరును కొనసాగించాలని కోరుకున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఆ సంగతేంటో చూద్దాం పదండి.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తున్నామన్న ఆలోచనతో ఆయన్ని, ఆయన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.

‘‘చంద్రబాబుకు మేలు చేస్తున్నామన్న ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి.. చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి.. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టించేదాకా.. ఏబీఎన్ రాధాకృష్ణగానీ.. టీవీ5 బీఆర్ నాయుడు కానీ నిద్ర పోకుండా.. వీళ్లిద్దరూ కృషి చేయాలని కోరుకుంటూ.. ఈ రోజు మేం సాధించిన విజయానికి మీరు అందించిన తోడ్పాటుకు మీకు, మీ ఛానెల్స్‌కు, మీ ఛానెల్స్‌లో వచ్చిన అపర మేధావులకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ వెటకారం ఆడారు మంత్రి కొడాలి నాని.