చిన్నమ్మకు కమలనాథుల ఆఫర్ ఇదేనా?

చెలరేగిపోయి చరిత్ర సృష్టిస్తానని చెప్పిన చిన్నమ్మ.. అందుకు భిన్నంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా చెప్పిన రాజకీయ సంచలనంగా మారారు. తెర వెనుక ఏదో జరిగిందన్న మాట బలంగా వినిపిస్తున్నా.. ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం క్లియర్ గా చెప్పలేని పరిస్థితి. తాజాగా ఆ విషయాలు బయటకు వచ్చేశాయి. చిన్నమ్మ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన దాని వెనుక చాలా పె..ద్ద కథే నడిచినట్లుగా చెబుతున్నారు.

రెండు అడుగులు వెనక్కి వేయటం వ్యూహాత్మకమే తప్పించి ఇంకేమీ కాదంటున్నారు. దీర్ఘకాలంగా అమలు చేయాల్సిన వ్యూహంలో భాగంగానే తాజాగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదంతా తాత్కాలికమే తప్పించి.. దీర్ఘకాలికం కాదంటున్నారు. బీజేపీ సిద్ధం చేసిన వ్యూహంలో భాగంగా.. చిన్నమ్మ కాస్త తగ్గినట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ బీజేపీ ప్రతిపాదించిన డీల్ ఏమిటి? అందుకు చిన్నమ్మ ఎందుకు ఓకే చెప్పారు? అన్నది చూస్తే.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష డీఎంకే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అలాంటి వేళలో.. అన్నాడీఎంకే ఓట్లను చీల్చేందుకు తాను.. తన మేనల్లుడి పార్టీ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. దీనికి తోడు అన్నాడీఎంకే మీద పట్టు సాధించాలన్న తన లక్ష్యం నెరవేరాలంటే ఇప్పటికి వెనక్కి తగ్గటమే మంచిదన్న ఆలోచనతోనే చిన్నమ్మ రాజకీయ సన్యాసాన్ని ప్రకటించినట్లు చెబుతున్నారు.

తనను ఇష్టపడని పార్టీ అధినాయకత్వం భారీగా దెబ్బ తినాలంటే ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదు. అందుకు తాను కారణం కాకూడదన్న ఉద్దేశం కూడా చిన్నమ్మ వెనకడుగుకు కారణమని చెప్పాలి. నిజానికి ఇప్పటి తమిళనాడు ప్రభుత్వంలోని అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో పలువురు చిన్నమ్మ విధేయులే. అయితే.. ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రిని ఎదిరించి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. దీనికి తోడు.. రానున్న రోజుల్లో అన్నాడీఎంకేను బలోపేతం చేయటానికి చిన్నమ్మ అవసరం చాలా ఉంది. దీన్ని గమనించిన బీజేపీ.. తాను వెనకుండి చిన్నమ్మను ముందుకు పెట్టటం ద్వారా.. తమిళనాడులో బలోపేతం కావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని బీజేపీ మాటను తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ససేమిరా అనటంతో.. బీజేపీ ప్లాన్ బీలోకి వెళ్లింది. ఇప్పుడేం చేసినా తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేను అధికారంలోకి రాకుండా అడ్డుకోవటం అసాధ్యం. దాని కంటే తమకు అవసరమైన 2024 పార్లమెంటు ఎన్నికల నాటికి స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకేను బలోపేతం చేయటానికి శశికళ అవసరాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికి చిన్నమ్మ రాజకీయ సన్యాసాన్ని ప్రకటించటం.. ఎన్నికలకు దూరంగా ఉండటం.. అన్నాడీఎంకే విజయాన్ని కాంక్షించటం లాంటివి చేయటం ద్వారా.. పార్టీ కోసం ఆమె ఎన్నో చేసిందన్న భావన కలిగేలా చేస్తారు.ఈ ఎన్నికల్లో డీఎంకే అద్భుత విజయం సాధించటం.. అన్నాడీఎంకే దారుణ ఓటమిపాలు కావటం తథ్యం. దీంతో.. పార్టీలో పళనిస్వామి ప్రభ తగ్గటమే కాదు.. పార్టీ బతకాలంటే చిన్నమ్మ తప్ప మరెవరూ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు చిన్నమ్మను పార్టీలోకి తేవటం ద్వారా.. బలమైన విపక్షం తయారవుతుంది.

2024 సార్వత్రిక ఎన్నికల నాటికి స్టాలిన్ ప్రభుత్వానికి మూడేళ్లు నిండటం.. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వచ్చి.. అప్పుడు జరిగే ఎంపీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పెద్ద ఎత్తున సీట్లను సొంతం చేసుకోవటం తమకు లాభిస్తుందన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుచెబుతున్నారు. ఈ ఫార్ములాకు చిన్నమ్మ సైతం ఓకే అన్నట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లుగా చేస్తున్న చిన్నమ్మ రుణాన్ని తీర్చుకునేందుకు.. ఆమెపై ఉన్న కేసులు నిదానంగా విచారణ సాగటం.. ఆమెకున్న వేలాది కోట్ల ఆస్తులకు తమ రక్షణ ఉంటుందన్న మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఐశ్వర్యం.. రాబోయే రోజుల్లో అధికారం వచ్చే అవకాశాన్ని తెలివైన చిన్నమ్మ ఎందుకు వదులుకుంటారు? అందుకే.. బీజేపీ డీల్ కు ఆమె సరేనని చెప్పి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.