రాజకీయాల్లో ప్రత్యర్తులుగా ఉన్న వారు అన్ని విషయాల్లోనూ కయ్యానికి కాలు రువ్వాల్సిన అవసరం లేదని పలు సందర్భాల్లో తమిళనాడు రాష్ట్ర పొలిటికల్ నేతలు నిరూపించారు. రాష్ట్రంలో అంతర్గతంగా ఎన్ని మాటలు అను కున్నా.. ఎన్ని విమర్శలు చేసుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో పోరాడాల్సి వచ్చినప్పుడు.. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సి వచ్చినప్పుడు.. అందరూ ఒకటైపోతున్నారు. తాజాగా సీఎం విజయ్.. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్లు కలిసిపోయారు.
అసెంబ్లీలో నీట్కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానానికి తమ సంపూర్ణమద్దతు ఉంటుందని ఉదయనిధి తెలిపారు. అంతేకాదు.. విజయ్ సర్కారుకు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. కేవలం తీర్మానం చేసి ఊరుకోవడం కాదని, దీనిని సాధించే వరకు కూడా కేంద్రంపై యుద్ధం చేయాలని పేర్కొన్నారు. విపక్ష నాయకులను అవసరమైతే ఢిల్లీకి కూడా తీసుకువెళ్లాలన్నారు. ఒక్క బీజేపీ మినహా.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా నీట్ కు వ్యతిరేకంగా విజయ్ ప్రభుత్వం తీసుకువచ్చిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
రెండు రోజుల కిందటి వరకు..
తమిళనాట.. రెండు రోజుల కిందటి వరకు.. రాజకీయాలు వేడెక్కాయి. విజయ్ స్నేహితురాలు త్రిషపై ఉదయనిధి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారంటూ ఉన్నపళాన ఆయనను అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. కోర్టు జోక్యంతో ఉదయనిధిని వదిలేసినా.. కేసు మాత్రం వెంటాడుతోంది. అసెంబ్లీలోనూ పలు అంశాలపైనా.. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంపై రచ్చ కొనసాగుతోంది. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే.. మాత్రం అధికార పక్షానికి ఉదయనిధి జై కొట్టడం గమనార్హం.
తాజా తీర్మనంలో..
తమిళనాడు అసెంబ్లీ నీట్కు వ్యతిరేకంగా తాజాగా చేసిన తీర్మానం ప్రకారం.. 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా వైద్య విద్యలో ప్రవేశాలకు విద్యార్థులను అనుమతించాలి. నీట్ పరీక్ష విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. దీనిద్వారా తలెత్తిన గందరగోళ పరిస్థితిని పూర్తిగా రూపుమాపేందుకు నీట్ను రద్దు చేయడమే పరిష్కారం. ఇది ప్రాంతీయ తత్వానికి విఘాతం కలిగిస్తోంది. ఆర్టికల్ 14 ప్రకారం.. ఉండాల్సిన విద్యార్థుల స్వేచ్ఛ(వారికి నచ్చిన భాషలో విద్యనుఅభ్యసించడం) ను కూడా హరిస్తోంది. అందుకే దీనిని రద్దు చేయాలి. అని తీర్మానంలో పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates