డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ర్యాలీల రచ్చ చూసి రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయడం జగన్ అండ్ కో కు మింగుడుపడటం లేదని నిరుద్యోగులు సైతం మండిపడుతున్నారు.
గత ఏడాది 2025 ఏప్రిల్ 20వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం జూన్, జులై లో పరీక్షల నిర్వాహణ పూర్తి చేసింది. ఆగస్టులో ఫలితాలు విడుదల చేసి సెప్టెంబర్ 15 నాటికల్లా ఫైనల్ సెలక్షన్ లిస్టు ప్రకటించింది. డీఎస్సీ ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించిన మంత్రి నారా లోకేష్ కు వచ్చిన క్రేజ్ ను జిర్ణించుకోలేని వైసీపీ ఎలాగైనా సరే ఆయన మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తుంది.
డీఎస్సీ ఎంపిక ప్రక్రియ అయిపోయి ఏడాది అవుతుంది. మెరిట్ సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలలో చేరిపోయారు కూడా. ఏడాది తర్వాత నిద్రలేచిన వైసీపీ నాయకులు డీఎస్సీ ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పుడు గుండెలు బాదుకోవడం జనాలకు అర్ధం కావట్లేదు. వీళ్ళు ఇన్నాళ్లు ఏమై పోయారని చర్చించుకుంటున్నారు. ఏదైనా తప్పు జరిగితే బాధితులు వెంటనే బయటకు వస్తారు. ఉద్యోగాల విషయంలో ద్రోహం జరిగితే అస్సలు ఊరుకోవడం జరగదు. కానీ మాకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఒక్క బాధితుడు కూడా మాట్లాడ్డం లేదు. ఇక్కడే జనాలకు వైసీపీ ర్యాలీల మీద చిర్రెత్తుకొస్తుంది.
జంతర్ మంతర్ లో విద్యార్థుల ఆందోళనకు విపరీతమైన క్రేజ్ రావడంతో జెన్ జీ పేరుతో జగన్ అండ్ కో ర్యాలీలు, దీక్షలు చేస్తుంది. ఈ ర్యాలీలు, దీక్షల్లో ఎక్కడా యువకులు, విద్యార్థులు కనిపించడం లేదు. కనీసం ఒక్క నిరసనలోనైనా డీఎస్సీ అక్రమాలకు నష్టపోయానంటూ బాధితుడు ఎవరూ ముందుకు రాలేదు. వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూలీ జనాలు, పెయిడ్ బ్యాచ్ ముఠా తప్ప అసలు డీఎస్సీ అభ్యర్థులు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ తంతు చూడలేకనే డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నిరసనలకు దిగారు. కష్టపడి ఉద్యోగం సంపాదించాం, తప్పుడు ఆరోపణలు చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయవద్దంటూ కోరుతూ డీఎస్సీలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించిన వైసీపీకి షాక్ ఇచ్చింది. ఒక ప్రతిపక్ష పార్టీ వైఖరి మీద ఇలా ర్యాలీలు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రధమం అని విశ్లేషకులు చెబుతున్నారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా వైసీపీ నాయకుల ర్యాలీలపై స్పందించారు. డీఎస్సీలో అక్రమాల గురించి చర్చకు సిద్దమని ప్రకటించారు. డీఎస్సీ నియమకాలు జరగకుండా వైసీపీ నాయకులు 226 కేసులు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. అయినప్పటికీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. జెన్ జీ పేరుతో వైసీపీ చేస్తున్న ర్యాలీల్లో ఎక్కడైనా యువకులు, విద్యార్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ ఎక్స్ లో పెట్టిన వీడియోలో కూడా విద్యార్థులు కనిపించడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని మండిపడ్డారు. అయితే లోకేష్ సవాల్ స్వీకరించడానికి జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ముందుకు రాక పోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates