తిరుపతిలో మిత్రపక్షాల బలమెంతో తెలుసా ?

తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నీకా నాకా అన్నట్లుగా మిత్రపక్షాలు బీజేపీ-జనసేనలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మిత్రపక్షాల్లో ఎందుకింత పోటీ ఉందంటే నియోజకవర్గం పరిధిలో తమకు విపరీతమైన బలం ఉందని రెండు పార్టీలు కూడా దేనికదే అనుకోవటమే. ఇందుకు రెండు పార్టీలు కూడా ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు.

అయితే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. దానికి ట్రయలర్ గా ఇపుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి అంటే పార్లమెంటు నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్ననే ముగిసిన నామినేషన్లలో మిత్రపక్షాల నేతలు ఎన్ని డివిజన్లలో నామినేషన్ల వేశారు ? పార్లమెంటుకు పోటీ చేయాలని పోటిపడుతున్న పార్టీలు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఎంత బలంగా ఉన్నాయో అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు.

చివరకు తేలిందేమంటే రెండు పార్టీల నేతలు కలిసి నామినేషన్లు వేసిన డివిజన్లు 11 మాత్రమే. ఇందులో కూడా బీజేపీ తరపున 8, జనసేన తరపున 3 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఉన్న డివిజన్లు ఎన్నో తెలుసా 50. అంటే 50 డివిజన్లకు గాను మిత్రపక్షాల తరపున పడిన నామినేషన్లు 11 అంటే 11 మాత్రమే. రెండు పార్టీలు కలిపి కనీసం సగం డివిజన్లలో కూడా పోటీ చేయలేకపోయాయి. మరి ఎన్నింటిలో గెలుస్తుందో చూడాల్సిందే.

ఎందుకీ పరిస్ధితి వచ్చిందంటే పోటీ చేయటానికి నేతలు కరువైన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. రెండు పార్టీలు విడివిడిగా ఎంత ప్రయత్నంచేసినా బీజేపీ, జనసేన తరపున పోటీ చేయటానికి ఎవరు ఆసక్తి చూపలేదని సమాచారం. మరి చెప్పుకోవటానికి రెండుపార్టీల్లోను పెద్ద పెద్ద నేతలే ఉన్నారు. మరి వాళ్ళంతా ఏమి చేస్తున్నారు ? 50 డివిజన్లలో గట్టి అభ్యర్ధులను కూడా రెడీ చేయలేకపోయారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. కేవలం ప్రెస్ మీట్లు, ట్విట్లర్లోను, ఎయిర్ పోర్టుల్లో రిసీవింగ్ అండ్ సెండాఫ్ అప్పుడు మాత్రమే కనిపించే నేతలున్న పార్టీలు కూడా ప్రగల్బాలు పలుకుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.