కాంగ్రెస్ పై షర్మిల దెబ్బ తప్పదా ?

తెలంగాణాలో తొందరలోనే పార్టీ పెట్టబోతున్న షర్మిల దెబ్బ ముందుగా కాంగ్రెస్ పైనే పడబోతోందని అర్ధమవుతోంది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే పార్టీ పేరు, జెండా, అజెండా మొత్తాన్ని షర్మిల ప్రకటించబోతున్నారంటే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే రెండు పార్టీలపైనే షర్మిల ప్రధానంగా గురిపెట్టారు. మొదటిది కాంగ్రెస్ పార్టీ కాగా రెండోది అధికార టీఆర్ఎస్.

తెలంగాణా వ్యాప్తంగా అనేక జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు పెద్ద ఎత్తున అభిమానులు, మద్దతుదారులున్నారు. వీళ్ళల్లో అత్యధికులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను భేరీజు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు భవిష్యత్తు లేదనే విషయాన్ని అందరు అనుకుంటున్నదే. కాబట్టి టీఆర్ఎస్ లో చేరలేక, బీజేపీలోకి వెళ్ళటం ఇష్టంలేక చాలామంది నేతలు ఇంకా హస్తం పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు.

ఇలాంటి వాళ్ళంతా షర్మిల పార్టీవైపు చూస్తున్నారని సమాచారం. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షర్మిలకు మద్దతుగా నిలిచారు. పార్టీలో మరో అధికార ప్రతినిధిగా ఉన్న తుంగతుర్తి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షర్మిలకు మద్దతుగా నిలిచే నేతల జాబితా పెరిగిపోవటం ఖాయం. పార్టీ పెట్టేనాటికి ఈ విషయంలో ఓ క్లారిటి వచ్చేస్తుంది.

అలాగే టీఆర్ఎస్ లో కూడా కేసీయార్ వ్యవహార శైలి నచ్చని నేతలు చాలామందే ఉన్నారు. వాళ్ళకి వేరేదారి లేక టీఆర్ఎస్ లోనే కంటిన్యు అవుతున్నారు. ఇపుడిప్పుడే కేసీయార్ పై ఉన్న వ్యతిరేకత మెల్లిగా వివిధ రూపాల్లో బయటపడటం మొదలైంది. కాబట్టి తొందరలోనే టీఆర్ఎస్ లో కూడా నిరసనగళాలు బయటపడతాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ముందు కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్ నుండి సీనియర్ నేతలు షర్మిలకు మద్దతుగా నిలబడినా ఆశ్చర్యపోవక్కర్లేదు.