సోషల్ మీడియాపై ఎందుకీ నియంత్రణ

కేంద్రప్రభుత్వం సోషల్ మీడియాపై హఠాత్తుగా నియంత్రణ చట్టాన్ని తెచ్చింది. దానికి వ్యక్తిగత స్వేచ్చ, పౌరుల హక్కులు, స్వీయ నియంత్రణ లాంటి పడికట్టు పదాలు చాలానే చెప్పింది. అయితే ఇన్ని సంవత్సరాలుగా గుర్తుకురాని విషయాలు ఇంత హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చాయి ? అన్నదే ప్రశ్న. ఎందుకంటే కేంద్రప్రభుత్వంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వచ్చేస్తోంది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు.

మోడి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు బాగా వివాదాస్పదమవుతున్నాయి. ఉదాహరణకు వంట గ్యాస్ ధరలు పెరిగిపోతుండంటం, పెట్రోలు, డీజల్ ధరలు మండిపోతుండటం. వీటి ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటాన్ని నెటిజన్లు జీడీపీ పెరుగుదల (గ్యాస్, డీజల్, పెట్రోల్) పేరుతో బాగా ఎద్దేవా చేస్తున్నారు.

అలాగే నిత్యవాసరాలైన బియ్యం, పప్పు, ఉప్పులు, నూనెల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వీటిని నియంత్రించటంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. ఇలాంటి అనేక అంశాలపై మామూలు జనాలతో పాటు ప్రత్యేకించి నెటిజన్లు తమదైన శైలిలో మోడి పాలనకు వ్యతిరేకంగా విరుచుకుపడుతున్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే గడచిన మూడున్నర నెలలుగా ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతుఉద్యమం కేంద్రానికి బాగా ఇబ్బందిగా తయారైంది. నూతన వ్యవసాయ చట్టాలరద్దు టార్గెట్ గా ఉద్యమం జరుగుతోంది.

ఈ విషయంలో ఉద్యమానికి మద్దతుగా మోడికి వ్యతిరేకంగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి అనేక విషయాల్లో కేంద్రప్రభుత్వాన్ని ప్రత్యేకించి మోడిని డైరెక్టుగా విమర్శించే నెటిజన్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి విమర్శలను, ఆరోపణలను మోడి తట్టుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే హఠాత్తుగా సోషల్ మీడియా నియంత్రణ పేరుతో చట్టాలను తెచ్చారు. ఇలాంటి వాటివల్ల వ్యతిరేకత మరింతగా పెరుగుతుందే కానీ తగ్గదని గతానుభవాలు చెబుతున్నాయి. చూద్దాం ఇపుడేమవుతుందో.