‘డెత్ సెల్‌’లో ఇమ్రాన్‌.. పాక్ ర‌ణ‌రంగం!

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని, ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ మృతి చెందిన‌ట్టు గ‌ట్టి న‌మ్మ‌కం ఏర్ప‌డుతోంద‌ని ఆయ‌న కుమారులు సులేమాన్‌, ఖాసీంలు పేర్కొన‌డంతో పాకిస్థాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ఇమ్రాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్ర‌భుత్వం ఏదో దాచిపెడుతోందంటూ.. ప్ర‌తిప‌క్షాలు కూడా పార్ల‌మెంటు ముందు ఆందోళ‌న‌కు దిగ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది.

2023 నుంచి రావ‌ల్పిండిలోని అడియాలా జైల్లో ఇమ్రాన్ బంధీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు స‌రైన ఆహారం ఇవ్వ‌క‌పోవ‌డం, ఆరోగ్య సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారంటూ.. బ‌లూచిస్తాన్ వేర్పాటు వాదులు అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోల‌ను రెండు రోజుల కింద‌ట పోస్టు చేశారు. ఇవి పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి. అప్పట్లోనే ఇమ్రాన్ సోద‌రీమ‌ణులు, ఆయ‌న కుమారులు రావ‌ల్పిండిలోని జైలు వ‌ద్ద ఆందోళ‌న‌కు రెడీ అయ్యారు.

అయితే.. ప్ర‌భుత్వం వారిని నిలువ‌రించింది. తాజాగా మాత్రం దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇమ్రాన్ మ‌ద్దతు దారులు రోడ్డెక్కారు. మరోవైపు రావ‌ల్పిండి బంద్‌కు ఇమ్రాన్ కుమారులు ఇద్ద‌రూ పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది ప్ర‌జ‌లు రావ‌ల్పిండి ర‌హ‌దారుల‌ను నిర్బంధించారు. దీనిని ముందుగానే ప‌సిగ‌ట్టిన షెహ‌బాజ్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం.. 144 సెక్ష‌న్ విధించింది. అయిన‌ప్ప‌టికీ ఆందోళ‌న కారులు జైలు వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.

ఇదిలావుంటే.. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉంటున్నార‌ని.. ఆయ‌న‌కు ఫైవ్ స్టార్ హోట‌ల్ ఫెసిలిటీల‌ను క‌ల్పించామ‌ని పాక్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై మాత్రం మౌనంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇమ్రాన్ ఖాన్‌ను డెత్ సెల్లో ఉంచార‌న్న(చ‌నిపోయిన వారిని ఉంచే కారాగారం) వార్త‌లు ఊపందుకున్నాయి.మ‌రోవైపు.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త్ అలెర్ట్ అయింది. పాక్ స‌రిహ‌ద్దుల వెంబ‌డి.. మ‌రింత భ‌ద్ర‌త‌ను పెంచింది.