యువతను టార్గెట్ చేస్తున్న షర్మిల

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు షర్మిల చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. తొందరలోనే కొత్తపార్టీ పెట్టబోతున్న షర్మిల ముందుగా యువతను టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సీటిలకు చెందిన సుమారు 400 మంది విద్యార్ధి నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఒకవైపు ప్రభుత్వంపై యువత అభిప్రాయాలు సేకరిస్తునే మరోవైపు దివంగత ముఖ్యమంత్రి విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను గుర్తుచేశారు.

ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అన్నా పేద విద్యార్ధులకు ఉన్నత చదువులన్నా వైఎస్సార్ హయాంలో బాగా ఆధరణ, అవకాశాలు ఉండేది. ఇదే విషయాన్ని షర్మిల పరోక్షంగా విద్యార్ధి నేతలతోనే చెప్పిస్తున్నారు. ఇదే సమయంలో కేసీయార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన కూడా విద్యార్ధి నేతలతోనే మాట్లాడిస్తున్నారు. వైఎస్ హయాంలో యువతకు ఉద్యోగాల కల్పన ఎలాగుండేది, ఇప్పటి పరిస్ధితి ఏమిటనే విషయంపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ఉద్యమ సమయంలో మన ఉద్యోగాలు, మన చదవులు అంటు కేసీయార్ అండ్ కో అనేక నినాదాలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి సుమారు ఏడేళ్ళు గడుస్తున్నా అప్పట్లో ఇఛ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదు. ఉద్యోగాలివ్వకపోవటంతో నిరుద్యోగులు, యువతలో కేసీయార్ పై అసంతృప్తి పెరిగిపోతోంది.

రాష్ట్రం మొత్తం మీద విద్యార్ధుల ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ ఉస్మానియా యూనివర్సిటి అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి యూనివర్సిటిలోకి కేసీయార్ కానీ లేదా ప్రభుత్వంలోని మంత్రులు కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కాలుపెట్టలేదు. ఉద్యమ సమయంలో ప్రతిరోజు యూనివర్సిటిలోకి వెళ్ళి విద్యార్ధి నేతలతో మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు మరిపుడు ఎందుకని అడుగు పెట్టలేకపోతున్నారు ? కేవలం ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్లే.

నిజానికి అప్పట్లో కేసీయార్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కూడా విద్యార్ధుల భాగస్వామ్యం వల్లే సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అప్పట్లో విద్యార్ధులు లేకపోతే ఉద్యమం సక్సెస్ అయ్యేదికాదేమో. అలాంటి విద్యార్ధి నేతలతో ఇపుడు షర్మిల భేటీలు జరపటం చాలా ఆసక్తిగా మారింది. యూనివర్సిటీల్లోని విద్యార్ధి నేతల మద్దతును సంపాదించగలిగితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మద్దతు సంపాదించటం తేలికవుతుందని షర్మిల అంచనా వేసినట్లున్నారు. మొత్తానికి మెల్లిగానే అయినా చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్న షర్మిల రాజకీయంపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది.