టీడీపీలో సామంతరాజులెవరబ్బా ?

విజయవాడలో నేతల వర్గపోరు బాగా పెరిగిపోతోంది. విజయవాడ ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా ఓడిపోయిన వారు సామంతరాజుల్లాగ ఫీలైపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తాను పర్యటించాలంటే ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ? అంటూ తీవ్రంగా మండిపోయారు. అయితే ఓడిపోయిన వాళ్ళు ఎవరు ? సామంతరాజుల్లాగ ఫీలైపోతున్న వారెవరు ? అనే విషయాలను మాత్రం కేశినేని చెప్పలేదు.

ఎంపిగా గెలిచిన తాను ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని అనటమే విచిత్రంగా ఉందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండే ఎంపికి, అప్పటి మంత్రి దేవినేని ఉమకు ఏమాత్రం పడేది కాదని పార్టీలోనే ప్రచారంలో ఉంది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటం, దేవినేని కూడా ఓడిపోయారు. ఇదే సమయంలో ఎంపిగా పోటీ చేసిన కేశినేని గెలిచారు. దాంతో తన ఓటమికి ఎంపినే కారణమని దేవినేని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారట.

ఇదే సమయంలో తన ఓటమికి దేవినేని తీవ్రంగా ప్రయత్నించారని అయితే దాన్ని తాను గుర్తించి మేల్కొనటం వల్లే అతికొద్ది మార్జిన్ తో అయినా గెలవగలిగినట్లు ఎంపి కూడా ఫిర్యాదు చేశారట. వీళ్ళద్దరి మధ్య పంచాయితి చేయటం కుదరక చంద్రబాబు ఇద్దరి ఫిర్యాదులను పక్కన పడేశారు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరినీ కంట్రోల్ చేసేంత సీన్ చంద్రబాబుకు లేదు. దాంతో విజయవాడలో పార్టీ నేతలు ఇద్దరి మధ్య చీలిపోయారు. దాంతో రెండు వర్గాలు ఒకదానిపై మరొక వర్గం ప్రతిరోజు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటునే ఉన్నాయి.

ఇపుడా అంతర్గత విభేదాలు పెరిగి చివరకు రోడ్డుమీద పడిపోయాయి. ఈ గొడవల విషయంపైనే రెండు రోజులుగా ఎంపి రెచ్చిపోయి ప్రత్యర్ధివర్గంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ గెలిచిన నేను తీసుకోవటం ఏమిటంటూ మండిపోతున్నారు. తనకున్న ప్రజాబలంతోనే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తానంటూ చాలెంజ్ చేశారు. మొత్తానికి ఏ ఒక్కరినీ పేరుపెట్టి నేరుగా మాట్లాడకపోయినా, ఆరోపణలు చేయకపోయినా తగలాల్సిన వారికి కచ్చితంగా తగిలే ఉంటుందనటంలో సందేహం లేదు.