కారుతో తొక్కించి కాకినాడ వైసీపీ కార్పొరేటర్ దారుణహత్య


ఏపీ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ను దారుణంగా హతమార్చిన ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.ఆర్థిక లావాదేవీలు.. పాతకక్షలతో హత్య చేసినా.. ఇంత దారుణంగా చంపేయటమా? అన్నది ప్రశ్నగా మారింది. కాకినాడ తొమ్మిదో వార్డుకు కంపర రమేశ్ వ్యవహరిస్తున్నారు. వైసీపీకి చెందిన ఈ సీనియర్ కార్పొరేటర్ గురువారం రాత్రి కార్ వాష్ కోసం కాకినాడ గంగరాజు నగర్ సెంటర్ కి వచ్చారు. ఆయన వెంటన మరో ఇద్దరు ఉన్నారు.

ఇదిలా ఉంటే కార్పొరేటర్ కు.. చిన్న అనే వ్యక్తికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవాలకు సంబంధించి పలు మెసేజ్ ల్ని కార్పొరేటర్ కు చిన్నా పంపారు. అయినప్పటికి ఆయన స్పందించలేదు. చివరకు గురువారం రాత్రి చిన్నాకు ఫోన్ చేసిన కార్పొరేటర్ కారు వాష్ సెంటర్ వద్దకు రమ్మన్నారు. అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చిన్న.. తన సోదరుడితో కలిసి వచ్చారు. అప్పటికే వారిద్దరూ పూటుగా తాగి ఉన్నారు. మాటలతో మొదలై.. కాసేపటికే గొడవగా మారింది.

కాసేపటికే ఇరువురు బాహాబాహీకి దిగారు. అక్కడే ఉన్న స్నేహితులు వారిద్దరిని వారించే ప్రయత్నం చేయగా.. వినలేదు. తన కారు తాళం కనిపించలేదని చిన్న కారుకు రమేశ్ అడ్డుగా నిలిచారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న చిన్న.. కారును స్టార్ట్ చేయటమే కాదు.. స్పీడ్ గా కార్పొరేటర్ మీదకు దూసుకెళ్లారు. దీంతో.. ఒక్కసారిగా రమేశ్ పక్కకు పడ్డారు. అయినప్పటికి వదలని చిన్నా.. కారును రివర్సు తీసుకొని వేగంగా తీసుకొచ్చి.. కార్పొరేటర్ ను తొక్కించేసి వెళ్లిపోయాడు.

ఈ సందర్భంగా రమేశ్ స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రమేశ్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రశాంతంగా ఉండే కాకినాడలో ఇంత ఆరాచకం చోటు చేసుకోవటం.. అధికార వైసీపీకి చెందిన కార్పొరేటర్ ను దారుణంగా హతమార్చటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.