ప్రైవేటుపరం కానున్న విశాఖ స్టీలు

ఎప్పటి నుండో అనుకుంటున్న పద్దతిలోనే విశాఖపట్నంలోని స్టీలు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయటానికి పావులు చురుగ్గా కదులుతోంది. స్టీలు ఫ్యాక్టరీలోని తన వాటాలో కొంత ఉపసంహరించుకోవటానికి కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసుకోవటం గమనార్హం. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. బడ్జెట్ తర్వాత వాటా ఉపసంహరణకు కేంద్రం ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలుపెట్టేసిందట. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్న ఏకైక కారణంతోనే ప్రైవేటుపరం చేయాలని కేంద్రం డిసైడ్ చేయటం విచిత్రంగా ఉంది.

స్టీలు ఫ్యాక్టరీ చాలా కాలంగా నష్టాల్లో ఉందన్నది వాస్తవం. అయితే ఎందుకు నష్టాల్లోకి వెళ్ళిపోయిందంటే ఫ్యాక్టరీకంటు సొంత ఐరన్ మైన్స్ లేకపోవటం వల్లే. సొంత గనులు లేని కారణంగా ముడి ఇనుము కోసం ఫ్యాక్టరీ ఇతర సంస్ధలపైన ఆధారపడాల్సొచ్చింది. దీనివల్ల ముడిసరుకును ఎక్కువ ధరపెట్టి కొనాల్సొస్తోంది. దీంతో ముడిసరుకు కొనుగోలుకు ఉత్పత్తి తర్వాత స్టీలు అమ్మకానికి మధ్య ధరల్లో బాగా తేడా వచ్చేసింది.

అంటే స్టీలు అమ్మే ధరకన్నా ముడిసరుకు కొనుగోలు ధరలు విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల సంవత్సరాలుగా ఫ్యాక్టరీ నష్టాల్లో కూరుకుపోతోంది, తనకు సొంతంగా ముడిసరుకు కోసం ఐరన్ గనులు కావాలంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం దశాబ్దాలుగా మొత్తుకుంటున్నా కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు. సొంత గనులు కావాలన్న విజ్ఞప్తిని పట్టించుకోని ఫ్యాక్టరీ నష్టాలకు సొంతగనులు లేకపోవటమే అని ఇపుడు స్ధాయిసంఘం చెప్పటం కేంద్రప్రభుత్వం అంగీకరించటం ఆశ్చర్యంగా ఉంది.

దశాబ్దాల పాటు నష్టాలు పేరుకుపోవటంతోనే తాజా సంస్ధ రూ. 1747 కోట్ల వోవరాల్ నష్టాల్లో కూరుకుపోయింది. నిజానికి ఇది భర్తీ చేసుకోలేనంత పెద్ద నష్టమేమీ కాదనే చెప్పాలి. ఇఫ్పటికైనా సంస్ధకు సొంత ఐరన్ గనులను కేంద్రం కేటాయిస్తే మెల్లిగా నష్టాలను పూడ్చుకుని లాభాల బాట పడుతుందనటంలో సందేహం లేదు. అయితే కేంద్రం ఆదిశగా ఆలోచించకుండా ఫ్యాక్టరీ నుండి తన వాటాను ఉపసంహరించుకుని ప్రైవేటు సంస్ధలకు అమ్మేయాలని డిసైడ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి కేంద్రమే వైజాగ్ స్టీలు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేసి ప్రైవేటుపరం చేయటానికి రెడీ అయిపోతోందని అర్ధమైపోతోంది.