అసలు తాము ఏమి చేస్తున్నారో నేతలకు అర్ధమవుతోందా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగాను ఉంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటయ్యా అంటే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ పేరుతో జనసేన పార్టీ తరపున షాడో కమిటిలు ఏర్పాటయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించమే విచిత్రంగా ఉంది. అసలు తాము ఏమి చేస్తున్నారో నేతలకు అర్ధమవుతోందా అన్న సందేహాలు జనాల్లో పెరిగిపోతున్నాయి.

దేవాలయాల నిర్వహణ, దేవాలయాల ఆస్తుల పరిరక్షణ అన్నది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన పని. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులకు జనసేన పార్టీ తరపున షాడో కమిటిని ఎలా నియమిద్దామని అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. అసలు షాడో కమిటిలను ఏర్పాటు చేసి పవన్ ఏమి సాదిద్దామని అనుకుంటున్నారు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా దేవాలయాలకు పాలకవర్గాలున్నాయి. కొంతకాలంగా దేవాలయాలపై జరుగుతున్న ఘటనలన్నీ ప్రముఖ దేవాలయాలు కావు. ఒక్క విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని సింహవాహనం వెండి సింహాలు మాయమవటం తప్ప మిగిలినవన్నీ మారుమూల దేవాలయాలే. సరే దేవాలయం ఎక్కడున్నా పవిత్రమే కాబట్టి వాటి పరిరక్షణకు ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. సుమారు 45 వేల దేవాలయాలకు ఇప్పటికే కెమెరాలు ఏర్పాటయ్యాయి.

దేవాలయాల నిర్వహణ, దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు పాలకవర్గాలు, అధికార యంత్రాంగం ఉంది. మరి జనసేన నియమించిన షాడో కమిటిలు ఏమి చేస్తాయి ? అనవసరంగా షాడో కమిటిలు ఓవర్ యాక్షన్ చేయటం, వాటితో పాలకవర్గాలకు లేదా అధికార యంత్రాంగానికి మధ్య గొడవలు అవటం తప్ప జరిగేదేమీ లేదు. మరి పవన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల వల్ల లేనిపోని తలనొప్పులు మొదలవ్వటమే తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు. మరి షాడో కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.