వెన్నుపోటులో చంద్రబాబుకు ‘ప్రపంచ రత్న’ ఇవ్వాలి: కొడాలి నాని

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి చేరుకున్న మహా వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి కొడాలి నాని కొనియాడారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి అర్పించిన నాని…చంద్రబాబును వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు అని తీవ్రంగా విమర్శించారు. పిల్లనిచ్చిన మామను మెడపట్టి గెంటేసి పార్టీని తస్కరించిన దొంగ.. ఎన్టీఆర్‌ వర్ధంతి నాడు ఆయనకు దండ వేయడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ ను ఎవరు చంపారో అందరికీ తెలుసని, ముఖాన ఉమ్మి వేస్తారనే సిగ్గు శరం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పినప్పుడు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని, చంద్రబాబు బతికుండగా ఎన్టీఆర్‌కు భారతరత్న రాదని విమర్శించారు.

ఎన్టీఆర్ తెర మీద నటుడని, చంద్రబాబు నిజ జీవితంలో నటుడని, వెన్నుపోటులో చంద్రబాబుకు ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని నాని డిమాండ్ చేశారు. రామారావు బొబ్బిలిపులి అని…చంద్రబాబు పిల్లి అని, టీడీపీని చంద్రబాబు, పప్పు నాయుడు మాత్రమే నాశనం చేయగలరని విమర్శించారు. ఎన్టీఆర్‌ గొప్పతనం గురించి ఏ పార్టీలోనూ రెండో ఒపీనియన్ లేదని, తమ పార్టీలో కూడా లేదని, ఎన్టీఆర్ ఆశీస్సులు తమకు, జగన్‌మోహన్‌రెడ్డికే ఉంటాయని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నాడు సీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో టీడీపీ వారిని అరెస్టు చేశారని, నేడు డీజీపీని భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే చంద్రబాబులాంటి వ్యక్తినైనా లాక్కొచ్చి లోపలేయవచ్చని, కానీ, తమ నాయకుడు జగన్ పక్కా మానవత్వవాది కనుక చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు.

చంద్రబాబు పక్కా రాజకీయ వ్యభిచారి, ఇలాంటి వెన్నుపోటు పొడిచే నీచుడిని బంగాళాఖాతంలో కలపాలి ఎన్టీఆర్‌ బొమ్మను తాకే అర్హత కూడా చంద్రబాబుకి లేదని మండిపడ్డారు. సీసీ కెమెరాలు లేని దేవాలయాలను చంద్రబాబు ఎంచుకుని దాడులు చేస్తున్నాడని, ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేయాలని కొడాలి నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లి 25 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ‘వదినని చంపి శాసనసభ్యుడైన వ్యక్తి ఉమ అని తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ఒక నిరుపేదకు కూడా పట్టా ఇవ్వలేని దౌర్భాగ్యం దేవినేనిదని, చంద్రబాబు బూటు నాకే వ్యక్తి ఆయన అని విమర్శించారు. ఉమ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే.. బడితపూజ చేస్తామని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.