ఐఏఎస్, ఐపీఎస్‌ల‌పై జ‌గ‌న్ మార్కు దూకుడు.. ఏం జ‌రుగుతుంది!

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఉద్యోగులు అంద‌రూ సానుకూలంగా ఉన్న ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌ట్టింది. నిజానికి ఒక‌ప్పుడు ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య స‌యోధ్య ఉండేది కాదు. త‌మ హక్కుల విష‌యంలో ప్ర‌భుత్వం ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న ఉద్యోగ వర్గాల్లో ప్ర‌ముఖంగా క‌నిపించేది. చంద్ర‌బాబు గ‌త పాల‌న‌ను తీసుకుంటే.. త‌మ‌పై భారం మోపేశారంటూ.. కొన్ని ఉద్యోగ సంఘాలు భారీగానే గ‌ళం వినిపించాయి.

నిజానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఉద్యోగుల‌కు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన స‌ర్కారుగా చంద్ర‌బాబు రికార్డు సృష్టించారు. అంతేకాదు.. వారానికి ఐదు రోజుల ప‌నిదినాల‌కు ప‌రిమిత‌మయ్యారు. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిపోయే అవ‌కాశం క‌ల్పించారు. అయినా.. కూడా బాబుకు ఉద్యోగుల ద‌గ్గ‌ర మార్కులు ప‌డ‌లేదు.

కానీ, జ‌గ‌న్ హ‌యాంలో ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఆయ‌న ఉద్యోగుల‌కు చేసింది ప్ర‌ముఖంగా ఏమీ క‌నిపించ‌క‌పోయినా.. వారంతా ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారిపోయారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల సంఘంతో ప్ర‌భుత్వాన్నికి వివాదం ఏర్ప‌డిన‌ప్పుడు.. ఉద్యోగులు బాహాటంగానే ఎన్నిక‌ల సంఘానికి స‌హ‌క‌రించేది లేద‌ని తేల్చి చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు. ఇది ప‌రోక్షంగా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించ‌డ‌మేననే వ్యాఖ్య‌లు వినిపించాయి.

అనంత‌ర ప‌రిణామాల్లో సీఎం జ‌గ‌న్ ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను స‌త్క‌రించ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల వంత వ‌చ్చింది. ముఖ్యంగా ఐపీఎస్‌ల‌లో ప్ర‌భుత్వంపై త‌ట‌స్థ వైఖ‌రి కొన‌సాగుతోంది. దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుతో తాము ఇరుకున‌ప‌డుతున్నామ‌ని.. డీజీపీ స్వ‌యంగా రెండు మూడు ప‌ర్యాయాలు కోర్టు గ‌డ‌ప తొక్కాల్సి వ‌చ్చింద‌ని వారిలో అసంతృప్తి ఉంది.

అదేస‌మ‌యంలో ఇంటిలిజెన్స్ మాజీ అధిప‌తి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసు న‌మోదు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డ‌డం కొంద‌రు ఐపీఎస్‌ల‌కు రుచించ‌డం లేదు. పైకి ఏమీ మాట్లాడ‌క‌పోయినా.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఈ వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో అలెర్ట్ అయిన జ‌గ‌న్‌.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తాము ఐపీఎస్‌ల‌కు వ్య‌తిరేకం కాద‌నే సంకేతాలు పంపే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో భాగంగా చంద్ర‌బాబు హ‌యాంలో డీపీజీగా చేసిన ఆర్పీ ఠాకూర్‌ను ఉన్న‌ప‌ళాన అత్యంత ప్రాధాన్య‌మున్న ఆర్టీసీ ఎండీ పోస్టుకు బ‌దిలీ చేశారు. నిజానికి వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఠాకూర్ కు.. వైసీపీకి మ‌ద్య తీవ్ర యుద్ధం సాగింది.

ముఖ్యంగా జ‌గ‌న్‌పై కోడిక‌త్తి దాడి జ‌రిగిన స‌మ‌యంలో వైసీపీ నేత‌లే దీనికి కార‌ణ‌మంటూ.. ఠాకూర్ విమ‌ర్శ‌లు చేశారు. ఈ ప‌రిణామం.. ఠాకూర్‌కు వైసీపీకి మ‌ధ్య గ్యాప్ పెంచేసింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం కొలువు దీరిన వెంట‌నే ఠాకూర్‌ను ఎలాంటి ప్రాధాన్య‌తా లేని ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ విభాగంలో ఎండీగా నియ‌మించారు. దాదాపు ఏడాదిన్న‌ర కాలంగా ఆయ‌న అక్క‌డే ప‌నిచేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్వం ఠాకూర్‌ను కీల‌క‌మైన‌.. ఆర్టీసీ ఎండీ పోస్టులోకి పంప‌డం రాజ‌కీయంగా వైసీపీని రక్షించుకునే క్ర‌మంలోనేన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. బ‌దిలీ చేసుకునే అధికారం వైసీపీకి ఉన్న‌ప్ప‌టికీ.. ఠాకూర్కే ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న సాటి అధికారులు చాలా మంది ఉన్నారు. కానీ, ఐపీఎస్ వ‌ర్గాల్లో ఉన్న గ్యాప్‌ను త‌గ్గించేందుకు, ప్ర‌భుత్వానికి సానుకూల ప‌రిస్థితి ఏర్పాటు చేసుకునేందుకు జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ప‌రిణామం ఏమేర‌కు ఆయ‌న‌కు లాభిస్తుందో చూడాలి.