తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకొక రోజు మహేష్ కుమార్ గౌడ్. ఎవరు మాట్లాడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రస్థావించడం, దాని మీద చర్చ జరగడం షరా మామూలైపోయింది. నాయకుల మాటలతో పార్టీలో ఏదో జరిగిపోతుందని ఊహాగానాలకు తావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
తాజాగా టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనకు మధ్య అభిప్రాయ భేదాలు ఏమీ లేవని తేల్చి చెప్పారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినా సాయంత్రానికే సరి చేసుకున్నాం అంటూ ముక్తాయింపు ఇచ్చారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు మామూలేనని చెప్పారు. దీంతో మేం ముందే చెప్పాం కదా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు మధ్య ఏదో జరుగుతుందని . ఇది నిజమని ఇప్పుడు మహేష్ కుమార్ స్వయంగా ఒప్పుకున్నారు చూడండి అంటూ కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి విషయమే కాకుండా మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ గురించి కూడా ఓ ముక్క అనేశారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే కొండా సురేఖ మీద వేటు వేసినట్లు చెప్పిన ఆయన ఒక బీసీ మంత్రిని తొలగించినప్పుడు చాలా బాధ పడ్డాను అని చెప్పారు. క్రమశిక్షణ తప్పితే ఎవరి మీదైనా సరే వేటు తప్పదని చెప్పి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడీ అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహేష్ కుమార్ గౌడ్ ఈ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారోనని జర్నలిస్టులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. తెలంగాణా అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. మంత్రి వర్గం రేసులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొండా సురేఖ ను మంత్రి వర్గం నుంచి తొలిగించారు కనుక బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వమని మహేష్ కుమార్ గుర్తు చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates