మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం మూడ్ ఆఫ్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ సర్వే ప్రకారం తదుపరి దేశ ప్రధానిగా 48.7 శాతం ప్రజలు మోదీని కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి 27.1 శాతం మద్దతు ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే…ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు 9.2 శాతం మద్దతు లభించడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది. ఈ సర్వే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కొంప ముంచేలా కనిపిస్తుంది.
ఎప్పుడైతే ఈ సర్వే ప్రకటన వచ్చిందో తమిళనాడులో టీవీకే నాయకులు, కార్యకర్తలకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను తదుపరి ప్రధాన మంత్రిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తమిళనాడులోని తుత్తుకూడితో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేశారు. నేడు తమిళనాడు సీఎం – రేపు దేశ పీఎం అంటూ వెలిసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించాయి.
తమిళనాడు నుంచే తదుపరి ప్రధాని వస్తారని ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు నచ్చడం లేదు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ పీఎం అభ్యర్థిగా రేసులో వున్నారు. అయితే మోదీ లేకపోతే రాగా అన్నట్టుగానే ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా విజయ్ పేరు రంగంలోకి రావడంతో సహజంగానే కాంగ్రెస్ లో కలవరం కనిపిస్తుంది. దీంతో తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీవీకే నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ప్రచారానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం ప్రభుత్వం మీద పడుతున్నట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి తమిళనాడులో టీవీకే నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్నో రోజులు కాలేదు. నాలుగు నెలల క్రితమే అక్కడ ఎన్నికలు జరిగాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం కాగా టీవీకే 108 స్థానాల్లో గెలిచి అధికారానికి ఆమడదూరంలో నిలిచింది. ఇలాంటి కీలక సమయంలో అప్పటివరకు డీఎంకేతో వున్న అనుబంధాన్ని తెంచుకొన్న కాంగ్రెస్ విజయ్ తో కాపురానికి సై చెప్పింది. తమిళనాడులో బీజేపీ అడుగు పెట్టకూడదన్న లక్ష్యంతో సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా విజయ్ కే జై కొట్టాయి. దీంతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఈ సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చు పెట్టినట్లు కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలు ఏర్పడినట్లు ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో జరిగిన ఓ పరిణామం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. నిన్నా మొన్నటి వరకు శాసన సభలో టీవీకే సభ్యులకు కేటాయించిన కాంగ్రెస్ పక్ష నేత సీటును ప్రతి పక్ష బెంచీలకు ముందు వరసలోకి మార్చడం జరిగింది.
తనకు కొత్తగా కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా నియమించినందు వలన సీటు మార్చినట్లు కుత్ బర్ట్ చెబుతున్నారు. అంతేనా ఇంకేమైనా వుందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అవన్నీ ఒట్టి ఊహాగానాలేనంటూ కొట్టి పడేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి విజయ్ కు మధ్య మంచి స్నేహ సంబంధాలు వున్నట్లు చెప్పడం గమనార్హం. మున్ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలని తమిళ తంబీలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
This post was last modified on September 2, 2026 10:04 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…