భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు రోజుల పర్యటనకు ప్రధాని మోదీ కిర్కిస్థాన్ కు వెళ్లారు. అక్కడ శాంఘయ్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇన్ స్టా లో విడుదల చేసిన వీడియోలో మన దేశ పారిశ్రామిక వేత్తలకు, ధనవంతులకు ఈ విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో భారీ ఖర్చులతో చేస్తున్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ కల్చర్ కు గుడ్ బై చెప్పాలని సూచించారు. అదేదో భారత్ లోనే చేసుకుంటే స్థానిక వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు.
ప్రపంచంలో చైనా తర్వాత ఇండియా అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల బిలియన్ల యూఎస్ డాలర్లను విదేశాలకు చెల్లించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ అవసరం లేకపోతే బంగారం కొనడం మానేయమంటూ సలహా ఇచ్చారు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించు కోవాలని, దేశీయంగా తయారైన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్లవుతుందని చెప్పారు.
ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటి సారిగా ప్రధాని ఇదే సలహా ఇచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అప్పుడు మోదీ చేసిన ప్రసంగం కలకలం సృష్టించింది. దేశ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని, దీనికి మోదీ ప్రకటనే నిదర్శనమని కాంగ్రెస్, ఇతరా ప్రతిపక్ష పార్టీలు విరుచుకొని పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సైతం మోదీ ప్రసంగం పై ఎవరికీ తోచినట్లు వాళ్ళు కథనాలు ప్రచురించారు.
అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో భారత్ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని ప్రకటించిన ప్రధాని మోదీ 140 కోట్ల ప్రజల ఐక్యత దేశాన్ని బలోపేతం చేస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వృద్ధిని ప్రజలు పండుగ చేసుకోవాలని కోరారు. కోవిడ్ తర్వాత ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కూడా దేశ ఆర్ధిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
