వెలిగొండ పై రాజకీయం మొదలు పెట్టిన హరీష్ రావు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో సోమ‌వారం సీఎం చంద్ర‌బాబు.. నాలుగు జిల్లాల్లోని 30 మండ‌లాల‌కు మేలు చేసే `పూల సుబ్బయ్య వెలిగొండ` ప్రాజెక్టును ప్రారంభించారు. త‌ద్వారా 4 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, 23 ల‌క్ష‌ల కుటుంబాల‌కు తాగు నీరు, మ‌రో 2 ల‌క్ష‌ల ఇళ్ల‌కు ఇంటింటి కుళాయి ద్వారా నీరు స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. అయితే.. అక్క‌డ నీరు పారితే.. తెలంగాణ‌లో ఇదే వెలిగొండ ప్రాజెక్టు రాజ‌కీయ విమ‌ర్శ‌లు పెల్లుబికేలా చేసింది. బీఆర్ఎస్ నాయ‌కుడు, జ‌ల‌వ‌న‌రుల శాఖ మాజీ మంత్రి హ‌రీష్ రావు.. సీఎంరేవంత్ రెడ్డిని ఉద్దేశించి స‌వాళ్లు రువ్వారు. విమ‌ర్శ‌లు గుప్పించారు.

దోచిపెడుతున్నారు!

కృష్ణా జ‌లాల‌ను ఏపీకి దోచిపెడుతున్నారంటూ.. హ‌రీష్‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు నానా తిప్పలు పడుతున్నార‌ని.. ఈ విష‌యంపై సీఎం రేవంత్ మౌనంగా ఉంటూ.. మ‌రోవైపు ఏపీకి నీటిని దోచిపెడుతున్నార‌ని అన్నారు. వెలిగొండ ఏపీకి వ‌ర‌మైతే.. తెలంగాణ‌కు గుదిబండ అని హ‌రీష్‌రావు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు ద్వారా.. తెలంగాణ వాటాకు సంబంధించిన కృష్ణా జ‌లాల‌ను కూడా ఏపీకి పారిస్తున్నార‌ని.. ఇంత జ‌రుగుతున్నా రేవంత్ మౌనంగా ఉన్నార‌ని, ఆయ‌న రైతుల పాలిట శాపంగా మారార‌ని వ్యాఖ్యానించారు. `వెలిగొండ.. మ‌న‌కు గుదిబండ` అని పేర్కొన్నారు.

రైతుల హ‌క్కులేమ‌య్యాయి?

రైతుల హ‌క్కులు కాపాడుతాన‌ని, తాను కూడా రైతు బిడ్డ‌నేన‌ని చెప్పుకొనే రేవంత్ రెడ్డి.. ఏపీ ప్ర‌భుత్వం హ‌ద్దులు మీరి వెలిగొండ ద్వారా నీటిని త‌ర‌లిస్తుంటే.. ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం తీవ్ర క‌రువుతో రైతులు అల్లాడుతున్నార‌ని.. మ‌రోవైపు బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగ‌ర్‌, క‌ల్వ‌కుర్తి వంటి కృష్ణా న‌ది నీటిపై ఆధార‌ప‌డిన ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోతున్నాయ‌ని వీటికి నీటిని విడుద‌ల చేయాల్సిన ప్ర‌భుత్వం.. ఈ విష‌యాన్ని విస్మ‌రించి. రైతుల‌కు క‌న్నీరు మిగిల్చుతోంద‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఏపీకి మాత్రం నీటిని త‌ర‌లించుకు పోయేలా దొడ్డిదారిలో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని నిప్పులు చెరిగారు.

గురువుకు ద‌క్షిణ‌గానా?

గురువుకు ద‌క్షిణ‌గా కృష్ణా నీటిని అప్ప‌గిస్తున్నారా? అని హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రాంత ఆయకట్టుకు నీరు ఇవ్వ‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో ఏపీ నీటిని త‌ర‌లించ‌డంతోపాటు.. అటు గోదావ‌రిపైనా.. ఇటు కృష్ణాపైనా ప్రాజ‌క్టులు క‌డుతుంటే..  ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. ఇదంతా గురు ద‌క్షిణ‌గా స‌మ‌ర్పిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని సవాల్ రువ్వారు. ఈ విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి జోక్యం చేసుకోవాల‌నికోరారు.