ఏపీలో అధికారం పంచుకున్న కూటమి పార్టీ జనసేన.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. జెన్జీకి చేరువ అయ్యేలా.. `యూత్ @ జనసేన` పేరుతో యువజన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన పార్టీ నుంచి తాజాగా వెలువడింది. అనేక కసరత్తులు.. యువత నుంచి అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం.. దీనికి శ్రీకారం చుట్టినట్టు పేర్కొంది.
పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సెప్టెంబరు 2న అత్యంత అట్టహాసంగా ఈ యువజన విభాగాన్ని ప్రారంభించనున్నట్టు జనసేన కార్యాలయం వెల్లడించింది. దీనిని ఆన్లైన్ వేదికగా.. ప్రస్తుతం కేరళలో ఉన్న పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. అది కూడా ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఈ యువసేనను ప్రారంభించనున్నట్టు తెలిపారు. యువసేనకు సంబంధించి ప్రత్యేక గీతం, లోగో, దిశానిర్దేశం చేసే విధానాలను కూడా అదే రోజు ఆవిష్కరించనున్నారు.
ఈ క్రమంలో పిఠాపురంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్టు పార్టీ తెలిపింది. అలానే.. పార్టీ కేడర్ను పరిమితంగా రావాలని సూచించారు. ఇక, ఈ యువ సేన ద్వారా.. పార్టీ మరింత బలం పుంజుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం యువతకు ప్రత్యేక విభాగం లేదని.. వివిధ వర్గాల నుంచివచ్చిన అభ్యర్థనల మేరకు దీనిని ఏర్పాటు చేస్తున్నామని పార్టీ వివరించింది.
గతంలో యువ రాజ్యం..
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో ఏడాది కాలంలోనే యువరాజ్యం పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. దీనికి అప్పట్లో పవన్ కల్యాణ్ నేతృత్వం వహించారు. అయితే.. 2014లో జనసేన ఏర్పడినా.. ప్రత్యేకంగా యువతకు విభాగం లేదు. కేవలం `వీరమహిళ` పేరుతో మహిళా విభాగాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. కాగా.. ఇటీవల యువత ప్రాధాన్యాలు పెరుగుతుండడం.. వారి ఆకాంక్షలు.. వంటివాటిని దృష్టిలో పెట్టుకుని యువతకు చేరువ అయ్యేందుకు.. యువ సేనను ఏర్పాటు చేస్తున్నట్టు నాయకులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
